
Income Tax Bill 2025: భారతదేశంలో ఆదాయపు పన్ను అధికారులు టాక్స్ ఎగవేతదారులను కనిపెట్టడానికి కొత్త సాంకేతిక మార్గాలను వినియోగించటం పెద్ద సంచలనం సృష్టిస్తోంది. గతంలో నోటీసులు అందించి దర్యాప్తు చేసిన టాక్స్ అధికారులు, ప్రస్తుతం పక్కా ఆధారాలతోనే టాక్స్ పేయర్స్ ను దర్యాప్తుకు పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు వివిధ ఏఐ సాధనాలను కూడా వాడుతున్నట్లు తేలింది. ఇది పన్ను ఎగవేతకు ప్రయత్నించే వారికి పెద్ద ఎదురుదెబ్బే.
వివరాల్లోకి వెళితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ప్రవేశపెట్టే క్రమంలో సంచలన విషయాలను బయటపెట్టారు. వాస్తవానికి లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికితీయటానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని బిల్లును సమర్థిస్తూ ఆమె సంచలన విషయాలను బయటపెట్టారు. మొబైల్ ఫోన్లలో ఎన్ క్రిప్ట్ చేయబడిన మెసేజ్లను విశ్లేషణ ద్వారా లెక్కల్లో చూపించని రూ.250 కోట్ల అక్రమ సంపాదనను పన్ను అధికారులు గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీ ఆస్తులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల నుంచి దర్యాప్తులో సేకరించిన ఆధారాలు కనుగొన్నట్లు ఆమె బయటపెట్టారు. వాట్సాప్ కమ్యూనికేషన్ రూ.200 కోట్ల లెక్కల్లో లేని డబ్బును దీని ద్వారా వెలికితీసినట్లు పేర్కొన్నారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం దేశంలోని ప్రజల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ పర్యవేక్షించటానికి పన్ను అధికారులకు అవసరమైన అనుమతిని చట్టపరంగా అందిస్తుందని నిర్మలమ్మ వెల్లడించారు. ఈ డబ్బును దాచిపెట్టడానికి నిందితులు తరచుగా ట్రావెల్ చేసిన ప్రదేశాల వివరాలను క్రోడీకరించటానికి గూగుల్ మ్యాప్స్ హిస్టరీని కూడా ఉపయోగించుకున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే బినామీ ఆస్థిని నిరూపించటానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించినట్లు చెప్పటం అక్రమార్కులకు ప్రస్తుతం చెమటలు పట్టిస్తోంది.
ALSO READ | మనందరి అక్క.. జీతం మొత్తాన్ని ఖాళీ చేస్తుంది : ఆర్థిక మంత్రి నిర్మలపై కునాల్ మరో సాంగ్
అందువల్ల కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడానికి చట్టపరమైన నిబంధనలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గతంలో ఉన్న ఆదాయపు పన్ను చట్టాలు ఈ తనిఖీలకు యాక్సెస్ ఇవ్వనందునే దానికి తగినట్లుగా ప్రస్తుతం తెస్తున్న కొత్త చట్టంలో మార్పులను చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అక్రమార్కులను అడ్డుకోవటానికి చట్టపరమైన మద్దతు అవసరమనీ లోక్సభలో ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రి మార్పులను సమర్థించారు.
ఇకపై కొత్త ఆదాయపు పన్ను బిల్లు అధికారులకు ప్రజల ఇమెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ ఇవ్వనుంది. అలాగే ఆర్థిక లావాదేవీలను దాచడానికి వ్యాపారాలు ఉపయోగించే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, స్టోరేజ్ సర్వర్లను యాక్సెస్ చేయడానికి అనుమతిని చట్టం కల్పించనుందని తెలుస్తోంది. డిజిటల్ అకౌంట్స్ నుండి ఆధారాలను సేకరించడం కోర్టు ముందు పన్ను ఎగవేతను నిరూపించడానికి మాత్రమే కాకుండా, పన్ను ఎగవేతల ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కించడానికి ఈ చర్యలో తోడ్పాటును అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు పన్ను ఎగవేత నోటీసులు కూడా వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.