దేశమంటే మట్టికాదోయ్​.. గురజాడ కవితతో నిర్మలమ్మ బడ్జెట్​ స్పీచ్ ​మొదలు

దేశమంటే  మట్టికాదోయ్​.. గురజాడ కవితతో నిర్మలమ్మ బడ్జెట్​ స్పీచ్ ​మొదలు
  • ఒక గంట 15 నిమిషాల పాటు ప్రసంగం
  • ‘వికసిత్​ భారత్​’ తమ లక్ష్యమని ప్రకటన

న్యూఢిల్లీ: తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు లోక్​సభలో ఆమె స్పీచ్​ ప్రారంభించి.. మధ్యాహ్నం 12.15 గంటలకు ముగించారు. దాదాపు ఒక గంట 15 నిమిషాలపాటు ప్రసంగం కొనసాగింది. మహా కుంభమేళా తొక్కిసలాటపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల నడుమే నిర్మలమ్మ 2025–26 బడ్జెట్​ స్పీచ్​ స్టార్ట్​ చేశారు.  

వికసిత్​ భారత్​ దిశగా..

ప్రపంచ వ్యాప్తంగా జియో పొలిటికల్​ సమ స్యలు ఉన్నప్పటికీ ‘వికసిత్​ భారత్​’ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని నిర్మలా సీతారామన్​ అన్నారు. ‘‘ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పినట్లు ‘దేశమంటే మట్టికాదోయ్​.. దేశమంటే మనుషులోయి’ అనే స్ఫూర్తితో ‘వికసిత్​ భారత్’ దిశగా సాగుతున్నాం. పేదరికాన్ని నిర్మూలించడం, పిల్లలకు 100%  మెరుగైన విద్య అందించడం, హై క్వాలిటీ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడం మా ముందున్న లక్ష్యాలు. పది  అంశాలతో ఈ బడ్జెట్​ను తీసుకువస్తున్నాం. పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నాం” అని వివరించారు. 

నాలుగు ఇంజిన్స్​

బడ్జెట్​ థీమ్​ నాలుగు ఇంజిన్స్​ చుట్టూ రూపొందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యవసాయం తమ మొదటి ఇంజిన్​ అని, ఎంఎస్​ఎంఈ తమ రెండో ఇంజిన్​ అని, ఇన్వెస్ట్​మెంట్స్​ మూడో ఇంజిన్​ అని, ఎక్స్​పోర్ట్స్​ నాలుగో ఇంజిన్​ అని వివరించారు.  ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ‘‘ప్రధానమంత్రి ధన్​ ధాన్య కృషి యోజన” కింద 100 అగ్రి జిల్లాలను అభివృద్ధి చేస్తామని.. రైతులకు కిషన్​ క్రెడిట్​ కార్డ్స్​ కింద ఇప్పటి వరకు ఉన్న రూ. 3 లక్షల రుణాన్ని రూ. 5లక్షలకు పెంచుతామని చెప్పారు. బిహార్​లో ‘మఖాన​బోర్డు’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.   ఎంఎస్ఎంఈలకు రుణాలను రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

విద్యార్థుల కోసం ‘భారతీయ భాష పుస్తక్’ స్కీమ్​ను తీసుకువస్తున్నామని.. దీని ద్వారా అన్ని పాఠ్యపుస్తకాలు భారతీయ భాషల్లో డిజిటల్​రూపంలో వస్తాయని తెలిపారు. విద్యారంగంలో ఏఐని జోడిస్తున్నామని వివరించారు.  రూ. 12 లక్షల లోపు ఆదాయం కలిగినవాళ్లు ట్యాక్స్​ కట్టాల్సిన అవసరం లేదని.. ఇది మిడిల్​ క్లాస్​ ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. గిగ్​ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఆరోగ్య బీమా కల్పిస్తామని నిర్మల తన బడ్జెట్​ స్పీచ్​లో ప్రకటించారు.


‘‘జీవులన్నీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నట్లే.. దేశంలోని పౌరులు సుపరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు” అనే తిరుక్కురల్‌‌‌‌‌‌‌‌లోని 542వ శ్లోకాన్ని నిర్మలమ్మ చదివి వినిపించారు. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు మంచి పాలనను అందించేందుకు సంస్కరణలే మంచి మార్గమని.. వికసిత్​ భారత్​ దిశగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని తెలిపారు.  

బిహార్ దులారీ దేవి ఇచ్చిన గిఫ్ట్​ చీరలో..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ధరించిన చీర ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిసారి బడ్జెట్​సమయంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పే చీరలో ఆమె కనిపిస్తుంటారు. శనివారం ఆఫ్​ వైట్​ కలర్​ చేనేత సిల్క్​ చీరను నిర్మలమ్మ ధరించారు. చేప కళాకృతులు చీరపై ముద్రించి ఉన్నాయి. అయితే.. ఈ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. బిహార్​కు చెందిన మధుబని కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా రూపొందించి దీన్ని ఇటీవల నిర్మలా సీతారామన్​కు గిఫ్ట్​గా ఇచ్చారు. బడ్జెట్​ సమయంలో ధరించాలని ఆమె కోరారు. మధుబని ఆర్ట్​లో ఈ చీరను తయారు చేశారు. దీనికి మ్యాచింగ్​గా ఎరుపు రంగు బ్లౌజ్​ను నిర్మల ఎంచుకున్నారు.
 

‘దహీచీనీ’ని తినిపించిన రాష్ట్రపతి

లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కలిశారు. ఈ సందర్భంగా నిర్మలకు రాష్ట్రపతి ‘దహీచీనీ (పెరుగు చక్కెర)’ను తినిపించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనాన్స్​ మినిస్టర్​ వెంట ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదురి, సీనియర్​ అధికారులు కూడా ఉన్నారు. లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని ఆర్థిక మంత్రి కలవడం ఆనవాయితీ. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్​ సమావేశమై.. బడ్జెట్​ను ఆమోదించింది.

కుంభమేళా తొక్కిసలాటపై ప్రకటనకు ప్రతిపక్షాల పట్టు నిరాకరించిన స్పీకర్​..పలువురు సభ్యుల వాకౌట్​

న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలంటూ పార్లమెంట్​ సమావేశాలను పలువురు ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లోక్​సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ స్పీచ్​  ప్రారంభిస్తున్న టైమ్​లో ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​  సహా కొందరు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కుంభమేళా తొక్కిసలాటపై ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ డిమాండ్​ చేశారు.  మృతుల సంఖ్యను దాస్తున్నారంటూ అఖిలేశ్​ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై లోక్​సభలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు పట్టుబట్టగా.. స్పీకర్​ ఓం బిర్లా నిరాకరించారు. ప్రతిపక్షాల నిరసన మధ్యనే నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగం మొదలుపెట్టారు. 5 నిమిషాల పాటు నినాదాలు చేసిన ప్రతిపక్ష సభ్యుల్లో కొందరు.. వాకౌట్​ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటికి మళ్లీ వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు.