
- నిందితుడిని అరెస్ట్ చేసిన నిజామాబాద్ సిటీ పోలీసులు
నిజామాబాద్, వెలుగు: మర్డర్ కేసులోని నిందితుడిని నిజామాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో, సెల్ఫోన్ కోసమే ఫ్రెండ్ ను హత్య చేసినట్టు తేల్చారు. బుధవారం నిజామాబాద్ సిటీ ఏసీపీ రాజావెంకటరత్నం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. సిటీలోని నాగారం కాలనీకి చెందిన భైరగోని సతీశ్ గౌడ్కు 2010లో పెండ్లి అయింది. మద్యానికి బానిసై పనిపాటలేకుండా తిరుగుతుండగా నాలుగేండ్ల కింద భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్ వెళ్లి చోరీలు చేస్తుండడంతో పాటు ఒక హత్య కేసులో అతడు జైలుకు వెళ్లొచ్చాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్తుండగా.. కాలనీకి చెందిన కండెల సందీప్తో సతీష్గౌడ్కు పరిచయమైంది. సందీప్ ఆటో నడుపుతుంటాడు.
దీంతో అతడిని చంపి ఆటో, సెల్ఫోన్ను చోరీ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈనెల15న సందీప్, సతీశ్ కలిసి నిజామాబాద్ సిటీలో ఆటో తోలగా.. వచ్చిన డబ్బులతో మద్యం తాగారు. కామారెడ్డికి కిరాయిలకు వెళ్దామని సతీశ్ నమ్మించాడు. ఇందల్వాయి టోల్గేట్ దాటాక ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకెళ్లి ఆటో ఆపాడు. సందీప్ మూత్ర విసర్జనకు ఆటో దిగాడు. వెనుక నుంచి సతీశ్ కాలుతో తన్నడంతో కిందపడిపోగా బండరాయితో తీవ్రంగా కొట్టాడు. చనిపోయాడనుకుని ఫారెస్టులో కట్టెలు ఏరుకొచ్చి డెడ్బాడీని కాల్చేసి ఆటోతో సతీశ్ హైదరాబాద్ పారిపోయాడు.
గత సోమవారం సగం కాలిన డెడ్బాడీని హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. అప్పటికే మృతుడి భార్య లత ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మర్డర్ కేసులో మృతుడి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిగా సతీశ్ ను గుర్తించారు. ఆటోలో నాగారంలోని తల్లిదండ్రుల వద్ద వస్తుండగా మాధవ్నగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కేసును ఛేదించిన నార్త్రూరల్ సీఐ బి.శ్రీనివాస్, ఎస్ఐ గంగాధర్ను ఏసీపీ అభినందించారు.