టాక్స్​ వసూళ్లపై ఫోకస్​.. నిజామాబాద్​ కార్పొరేషన్​ పరిధిలో పన్నుల వసూళ్ల టార్గెట్​ రూ. 50 కోట్లు

టాక్స్​ వసూళ్లపై ఫోకస్​.. నిజామాబాద్​ కార్పొరేషన్​ పరిధిలో పన్నుల వసూళ్ల టార్గెట్​ రూ. 50 కోట్లు
  • జిల్లావ్యాప్తంగా స్పెషల్​ టీంల ఏర్పాటు
  • ఇందూర్ కార్పొరేషన్​లో 18.5 కోట్లు రికవరీ
  • మున్సిపాలిటీలు,  గ్రామ పంచాయతీలపై ప్రత్యేక ఫోకస్​
  • అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్న ఆఫీసర్లు

నిజామాబాద్, వెలుగు : పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అధికారులు స్పీడ్ పెంచారు. ఇందుకు గాను జిల్లా యంత్రాంగం స్పెషల్​ టీంలను నియమించింది. నిజామాబాద్​ కార్పొరేషన్​ పరిధిలో పన్నుల వసూళ్ల టార్గెట్​ రూ. 50 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.18.5 కోట్లను ఆఫీసర్లు వసూలు చేశారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు కార్పొరేషన్​కు స్పెషల్​ ఆఫీసర్​వ్యవహరిస్తూ టాక్స్​ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.  టాక్స్​ బకాయి ఉన్న 20 వేల మందికి నోటీసులు జారీ చేశారు. 

డిప్యూటీ కమిషనర్​, ఈఈ, డిప్యూటీ మున్సిపల్ ఇంజినీర్, శానిటరీ సూపర్​వైజర్ ను  నోడల్​ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు ప్రతి డివిజన్​లో వార్డు ఆఫీసర్​నూ నియమించారు. బకాయిదారుల వద్దకు వెళ్లి పన్ను వసూలు చేసి టార్గెట్​ను రీచ్ అవుతున్నారు. టాక్స్​ వసూళ్లపై నిత్యం సమీక్ష ఉంటుందని, అధికారులు ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.  50 శాతం కూడా టాక్స్​ వసూలు కాని మున్సిపాలిటీలు, గ్రామాలపై అధికారులు స్పెషల్​ ఫోకస్ పెడుతున్నారు.  కులగణన సర్వే, స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటరు లిస్టు తయారీలో అధికారులు నిమగ్నం కావడం వల్ల పన్నుల వసూళ్లలో కాస్త వెనుకబడినా, ప్రస్తుతం జోరు పెంచారు.  

బల్దియాల్లోనూ అదే స్పీడ్​..

పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీల్లోనూ అధికారులు స్పీడ్​ పెంచారు. బోధన్​ మున్సిపాలిటీలో రూ.6.39 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు  రూ.2.84 కోట్లు వసూలు చేశారు.  మిగతా రూ.3.54 కోట్ల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్​ వెంకటనారాయణ ఏడు స్పెషల్​ టీంలను ఏర్పాటు చేసి పన్నులను వసూలు చేయిస్తున్నారు. భీంగల్​ మున్సిపాలిటీలో కమిషనర్​ గంగాధర్​ ఐదు ప్రత్యేక టీంలతో రూ.2.25 కోట్ల బకాయిలకుగాను రూ.1.11 కోట్లు వసూలు చేయించారు. ఆర్మూర్​ బల్దియాలో రూ.6.57 కోట్లకుగాను ఐదు టీంలు పర్యటిస్తూ 3.67 కోట్లను వసూలు చేశారు. 

పంచాయతీల్లో టార్గెట్​ రూ.16 కోట్లు..

జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రూ.29.58 కోట్లు పన్నులు పెండింగ్​లో ఉన్నాయి.  అధికారుల టార్గెట్​ రూ.16 కోట్లు కాగా, ఇప్పటివరకు  రూ.13 కోట్లు వసూలయ్యాయి. విలేజ్ సెక్రటరీలకు రోజు వారి టార్గెట్ పెట్టారు. అదనపు కలెక్టర్ అంకిత్​ బోధన్​, ఆర్మూర్​, భీంగల్​ మున్సిపాలిటీలకు స్పెషల్​ ఆఫీసర్​గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామాల్లో టాక్స్​వసూళ్లలో స్పీడ్​ పెంచారు.