
ప్రపంచంలోనే తొలిసారిగా ఎం-3 రకం ఈవీఎంలతో పోలింగ్ జరుగుతున్న నిజామాబాద్ లోక్సభ నియోజక వర్గం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నియోజక వర్గం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 12 ఈవిఎంలను ఏర్పాటు చేశారు.
అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజక వర్గంగా మాత్రమే కాకుండా, అంతమంది కోసం ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా నిజామాబాద్ వార్తల్లోకి ఎక్కింది. 178 మంది రైతులతో పాటు మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేయనున్న ఈ స్థానాన్ని ఎలక్షన్ కమీషన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోలింగ్ నిర్వహిస్తుంది.
ఈ భారీ ఎన్నికల తంతును గత కొద్దిరోజులుగా దగ్గరుండి చూస్తున్న గిన్నిస్ రికార్డు ప్రతినిధులు.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిస్తే ప్రపంచ రికార్డును ప్రకటించే అవకాశముంది. కాగా అదే జరిగితే ఎన్నిక ప్రక్రియ గిన్నిస్లో చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం కానుంది.