
- పపు రైతులు, ఏజెంట్లతో అడిషనల్ కలెక్టర్ మీటింగ్
- కొమ్ము పసుపు క్వింటాల్కు రూ.9,500 ఇచ్చేలా ఒప్పందంసు
నిజామాబాద్, వెలుగు : పసుపు రేటు భారీగా పడిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు సోమవారం నిజామాబాద్లో ఆందోళనకు దిగారు. దళారులు ధరను తగ్గిస్తూ తమను మోసం చేస్తున్నారంటూ బస్టాండ్ ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్లోని గంజ్ మార్కెట్కు సోమవారం 39 వేల బస్తాల పసుపు వచ్చింది. క్వింటాల్ పసుపు రేటును రూ. 8 వేలకు తగ్గించడంతో అమ్మేందుకు రైతులు ఒప్పుకోలేదు.
దీంతో దళారులు వచ్చి రైతులతో మాట్లాడారు. పసుపు రేటు మరింత పడిపోతుందని, ఇప్పుడే అమ్మేస్తే మేలు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సెక్రటరీ అపర్ణను కలిసేందుకు వెళ్లారు. వారు అందుబాటులో లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించేందుకు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు.
దళారులు రేటు తగ్గిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్ రేటు రూ.10 వేలకు తగ్గదని హామీ ఇచ్చిన కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు రాస్తారోకో విరమించేదే లేదని పట్టుబట్టారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెహికల్స్ నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ ఘటనాస్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పి, రేటుపై చర్చించేందుకు తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటల నుంచి ఏడున్నర దాకా రైతుప్రతినిధులు, ఏజెంట్లతో చర్చలు జరిపారు. అనంతరం పసుపు కొమ్ములు క్వింటాల్కు రూ.9,500, మండకు రూ.8 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. చర్చల్లో మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.