నేపల్​లో  తూప్రాన్​ కౌన్సిలర్లు

 నేపల్​లో  తూప్రాన్​ కౌన్సిలర్లు
  •     బీఆర్​ఎస్​ మున్సిపల్​ చైర్మన్​పై అవిశ్వాసం 
  •     వచ్చేనెల 6న బలనిరూపణ

మెదక్, తూప్రాన్​, వెలుగు : తూప్రాన్​ మున్సిపల్​లో  బీఆర్​ఎస్​  చైర్మన్​ వర్సెస్​ వైస్​ చైర్మన్​గా రాజకీయ వివాదం  మారింది. ఎప్పటి నుంచో  అవకాశం కోసం చూస్తున్న వైస్​ చైర్మన్​, తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్​లో చేరి.. చైర్మన్​పై అవిశ్వాసం పెట్టారు.  దీంతో చైర్మన్ బొంది రవీందర్ గౌడ్​ను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసంతృప్తితో ఉన్న వైస్ చైర్మన్, 7గురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేరారు. మరో ఇద్దరు కాంగ్రెస్​, ఒక బీఆర్​ఎస్​, ఒక బీజేపీ కౌన్సిలర్​ సపోర్టుతో అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్​కు నోటీస్ ఇచ్చారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

బీఆర్​ఎస్​లో మొదటి నుంచీ గొడవలే.. 

బీఆర్​ఎస్​ చైర్మన్​ బొంది రవీందర్​  గౌడ్​, వైస్ చైర్మెన్ నంద్యాల శ్రీనివాస్ మధ్య మొదటి నుంచీ విభేదాలు న్నాయి. చైర్మన్​ ను దించేయాలని వైస్​ చైర్మన్​ వర్గం చాలాకాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే..  వైస్ చైర్మన్   సహా తొమ్మిది మంది కౌన్సిలర్లు  బీఆర్​ఎస్​ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం చైర్మన్​ రవీందర్​  గౌడ్​ మీద అవిశ్వాసం పెట్టారు. మొత్తం 10 మంది కౌన్సిలర్లు నేపాల్​లో క్యాంప్​ కు వెళ్లారు. ఈ నేపథ్యంలో చైర్మన్​ రవీందర్​ గౌడ్ సైతం తన మద్దతుదారులైన మరో ఐదుగురు కౌన్సిలర్లతో  కలిసి క్యాంప్​ కు వెళ్లారు. 

రెండు క్యాంపులు.. రాజకీయ చర్చ.. 

రెండు వర్గాల క్యాంప్​లు కొనసాగుతున్న క్రమంలో వైస్​ చైర్మన్​ శ్రీనివాస్​ తోపాటు ఏడుగురు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్​ ని కలిసి కాంగ్రెస్​లో చేరారు. చైర్మన్​ పై అవిశ్వాసం ప్రవేశ పెట్టి నెగ్గాలంటే 11 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండగా, వైస్​ చైర్మన్​ శ్రీనివాస్ వర్గం చైర్మన్​ రవీందర్​ గౌడ్​ వర్గంలోని ఒక బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ను తమ వైపు తిప్పుకుంది.

దీంతో 11 మంది కలిసి కలెక్టర్​కు అవిశ్వాసం నోటీస్​ ఇచ్చారు. మున్సిపల్​ చైర్మన్​ రవీందర్​​ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నందునే అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు వైస్​ చైర్మన్​ నందాల శ్రీనివాస్ సహా , కౌన్సిలర్లు తెలిపారు. అభివృద్ధి పనుల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నట్టు కలెక్టర్​కు ఇచ్చిన అవిశ్వాసం నోటీస్​లో ఆరోపించారు. 

ప్రయత్నాలు విఫలం చేస్తారనే...

కలెక్టర్​కు అవిశ్వాసం నోటీస్​ ఇచ్చిన తరువాత వైస్​ చైర్మన్​ శ్రీనివాస్ వర్గం కౌన్సిలర్లు నేపాల్​ వెళ్లారు. ఇక్కడే ఉంటే అవిశ్వాస ప్రయత్నాలు విఫలం చేసేందుకు చైర్మన్​ రవీందర్ గౌడ్​ ప్రయత్నిస్తాడని  భావించి గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వారిని నేపాల్​ తీసుకెళ్లినట్టు తెలిసింది. అవిశ్వాసం నోటీస్​ ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్​ మార్చి 6వ న తూప్రాన్​ మున్సిపల్​ ఆఫీస్​లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు చైర్మన్​ భవితవ్యం తేలిపోనుంది.