
- మంగళవారం నుంచి టన్నెల్ వద్దకు మీడియాకు నో ఎంట్రీ
మహబూబ్నగర్/అమ్రాబాద్, వెలుగు ఫొటోగ్రాఫర్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగినప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చూపు ఇక్కడే ఉంది. ఉన్నతాధికారుల నుంచి మంత్రుల వరకు అందరూ ప్రమాదంలో గల్లంతైన వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ టీమ్లు లోపలికి వెళ్లిన ప్రతిసారి దాదాపు ఐదు గంటల వరకు అక్కడే వర్క్ చేస్తున్నాయి. ఒక షిఫ్ట్ టీమ్ అర్ధరాత్రి 2 గంటలకు లోపలికి వెళితే తిరిగి ఉదయం 8 గంటలకు బయటకు వస్తోంది. మరో టీం మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి వెళితే రాత్రి తిరిగొస్తుంది. శిథిలాలను తీసేందుకు మధ్యాహ్నం హిటాచీని తీసుకెళ్లారు.
వెంట 30 మంది కార్మికులు కూడా వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ టీమ్ మెంబర్స్కు అక్కడే భోజనం, నీరు అందిస్తున్నారు. టన్నెల్ ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లడానికి మెయిన్ రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్లు అటవీ మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. దీంతో అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఓ ప్రైవేట్ కంపెనీ టవర్ను ఏర్పాటు చేసింది. అలాగే టన్నెల్లో సగం వరకే సిగ్నల్ వస్తుండడంతో వాకిటాకీలు వినియోగిస్తున్నారు.