IPL 2025: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. చెన్నైతో జరిగే మ్యాచ్‌కు దూరం

IPL 2025: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. చెన్నైతో జరిగే మ్యాచ్‌కు దూరం

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. 

ఎందుకీ నిషేధం..?

గత ఎడిషన్ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. అంటే, నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. దాంతో అతనిపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది. ఆ నిషేధం ఈ ఏడాదిలో అమలు కానుంది. 

కఠిన నిబంధనలు..

మ్యాచ్ చేజారుతుందన్నా.. లేదా కాస్త ఉత్కంఠగా సాగుతోంది అంటే ఆటగాళ్లు సమయాన్ని వృధా చేయడం కామన్. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి నలుగురైదుగురు ఒక్కచోట చేరి ప్రణాళికలు రచిస్తుంటారు. గడుస్తున్నా సమయాన్ని అసలు పట్టించుకోరు. దీన్ని కట్టడి చేయడానికే ఐపీఎల్ నిర్వాహకులు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. మొదటి సారి స్లో ఓవర్‌రేట్‌కు గురైతే కెప్టెన్‌ మ్యాచ్ ఫీజులో 12 లక్షలు కోత విధిస్తారు. అదే రెండో సారి రిపీట్ అయితే రూ. 24 లక్షలు, మూడో సారి రిపీట్ అయితే రూ. 30 లక్షల మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు.

ఈ రూల్సే పాండ్యాపై నిషేధానికి కారణమయ్యాయి. రోహిత్ టీ20ల నుంచి తప్పుకున్నారు కనుక ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడని సమాచారం.