
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్ను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ERC). సగటు యూనిట్ ధరను రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి కొత్త టారిఫ్ వివరాలను ERC ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. వివిధ సంఘాల సూచనల మేరకు టారిఫ్పై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇకపై గృహ వినియోగదారుడిపై కనీస ఛార్జీలు ఉండవని చెప్పారు. కనీస ఛార్జీల స్థానంలో కిలో వాట్కు రూ.10చెల్లిస్తే చాలన్నారు. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట ఛార్జీలు ఉండవన్నారు. పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చబోమని జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు.
రైతుల ఉచిత విద్యుత్కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు చెప్పారు. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేస్తామన్నారు. కులవృత్తులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని..దీంతో రూ.1,657 కోట్ల భారం పడుతోందన్నారు. కొత్త టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ERC ఛైర్మన్ తెలిపారు.