
బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా.. కాంగ్రెస్ గెలుపును ఆపలేరని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసగించిన పార్టీలని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల తర్వాత ఇప్పుడు పొలాల వెంట తిరుగుతున్నారని అన్నారు. వర్షాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడు రైతుల పట్ల కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నాయత్వంలో పనిచేసి వంశీని గెలిపిస్తామని చెప్పారు.
బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటం : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. వంశీకృష్ణ కాకా లెగసీని కాపాడుతూ రాజకీయాల్లోకి వచ్చారని, ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారని చెప్పారు.
ఏఐసీసీకి కృతజ్ఞతలు : బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
వంశీకృష్ణకు ఎంపీ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధినాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. పెద్దపల్లి ప్రజలు వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.