ఆలేరు చుట్టే డెయిరీ పాలిటిక్స్

ఆలేరు చుట్టే డెయిరీ పాలిటిక్స్
  • డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ల కు ముగిసిన ఉప సంహరణ గడువు
  • నల్గొండ నుంచి 8 మంది, రంగారెడ్డి నుంచి ఆరుగురు పోటీ
  • ఆలేరు ఎమ్మెల్యే బీర్ల, మాజీ డీసీసీబీ గొంగిడి వర్గాల మధ్య పోరు
  • ఈ నెల13న డైరెక్టర్ల ఎన్నికలు.. షురువైన క్యాంపు రాజకీయాలు

నల్గొండ, వెలుగు : మదర్ డెయిరీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. 6 డైరెక్టర్​పోస్టులకు మొత్తం12 మంది బరిలో నిలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4  డైరెక్టర్ స్థానాలకు 8 మంది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 సీట్లకు నలుగురు పోటీ పడుతున్నారు.  ఒక్క ఏరియా నుంచే 8 మంది పోటీ చేస్తుండగా.. ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ పైనే ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్యానల్​లో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూద న్ రెడ్డి, పుప్పాల నర్సింహులు, బత్తుల నరేందర్​రెడ్డి ఉన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్​ మహేందర్ రెడ్డి ప్యానల్​లో ఒగ్గు భిక్షపతి, డి.సోమిరెడ్డి, ఎం కొండల్​రెడ్డి, భాస్కర్​ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల తరపున నలుగురు పోటీ పడుతున్నారు. పరిగి నుంచి ఇద్దరు, మాల్, కందుకూరు నుంచి ఇద్దరు బరిలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా నుంచి బీఆర్ఎస్​క్యాండిడేట్లు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఏ. నర్సింహారెడ్డి, పగడాల గణేశ్​, మండలి జంగయ్య, ఎడ్ల రాంరెడ్డి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.  

రెండు జిల్లాలకు సపరేట్ బ్యాలెట్

ఈ నెల13న డెయిరీ ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సపరేట్​బ్యాలెట్​ఉంటుంది. దీంతో ప్రతి ఓటరు ఆరు ఓట్లు వేసుకోవచ్చు. అయితే.. ఒక బ్యాలెట్​లో 4 ఓట్లు, రెండో బ్యాలెట్​లో 2 ఓట్లు వేయాలి. మొత్తం పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు వచ్చిన అభ్యర్థిని డైరెక్టర్​గా ప్రకటిస్తారు. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య తొలిసారిగా డెయిరీ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తుండగా..  తన అనుచరుడు మధుసూదన్​రెడ్డిని చైర్మన్​చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గొంగిడి మహేందర్​రెడ్డి తన ప్యానల్​లోని కొండల్​రెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో ఆలేరు చుట్టే డెయిరీ ఎన్నికల రాజకీయాలు తిరుగుతున్నారు. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు క్యాంపులకు ఓటర్లు తరలించే ఏర్పాట్లను ఇరువర్గాలు చేస్తున్నాయి.