ముగిసిన నామినేషన్ల ప్రకియ.. 32 పట్ట భద్రుల, 1 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ

ముగిసిన నామినేషన్ల ప్రకియ.. 32 పట్ట భద్రుల, 1 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం( ఫిబ్రవరి 11) ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్లు వేశారు. అందులో 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సరైన ఫార్మాట్ లో ఉన్న 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి.

ఇక ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 16 మంది నామినేషన్లు ఆమోదించారు.

 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు.

నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగిందని ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  తెలిపారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. 

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అభ్యంతరాలు కోరారు. తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలియచేశారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, ఏవో నరేందర్, తహసిల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.