
- సిద్దిపేట జిల్లా ఖాజీపూర్లో ముదిరాజ్ కులస్తులకు సహాయ నిరాకరణ
- ఉల్లంఘిస్తే రూ.5 వేల ఫైన్
- కలెక్టర్కు మొర పెట్టుకున్న బాధితులు
దుబ్బాక, వెలుగు : ముదిరాజ్ కులస్తులకు, గ్రామస్తులకు ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఏకంగా వారికి గ్రామంలో సహాయ నిరాకరణ చేయాలని ప్రకటించే వరకు వెళ్లింది. ముదిరాజ్కులస్తులకు హోటళ్లలో టీ, కిరాణం షాపుల్లో నిత్యావసర వస్తువులు ఇవ్వొద్దని, గౌడ్స్కల్లు పోయొద్దని, నాయీ బ్రహ్మణులు కటింగ్, గడ్డం చేయొద్దని, రజకులు బట్టలు ఉతకొద్దని, ఎవరైన మరణిస్తే చావు డప్పు కొట్టొద్దని, కిరాయి ఇండ్లల్లో ఉంటున్న వ్యక్తులను ఖాళీ చేయించాలని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్భర్పేట భూంపల్లి మండలం ఖాజీపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన 20 ముదిరాజ్ కుటుంబాలు 1994లో మత్స్య పారిశ్రామిక సొసైటీగా ఏర్పాటు చేసుకుని జిల్లా మత్స్య సహకార సంఘంలో రిజిస్ట్రేషన్చేసుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలోని చెరువులు, కుంటల్లో చేపలు పెంచి, అమ్ముకుంటూ బతుకుతున్నారు. 5 నెలల క్రితం గ్రామ మత్స్య సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా మత్స్య సహకార సంఘానికి వినతి పత్రం ఇచ్చారు. సంబంధిత అధికారి ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తామని నోటీసులు అందజేశారు.
ఆ రోజున గ్రామానికి వస్తామని చెప్పిన అధికారి ఎంతకీ రాకపోవడంతో సొసైటీ సభ్యులు ఫోన్చేయగా ‘మీ గ్రామంలో కొంతమంది ఫోన్చేసి ఎన్నికలు నిర్వహించొద్దని బెదిరించారు. అందుకే రాలేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది పొలిటికల్లీడర్లు అదే రోజు రాత్రి ముదిరాజ్కులస్తులకు ఎవ్వరూ సాయం చేయొద్దని ఆర్డరిచ్చారు. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించిన వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని, సదరు వ్యక్తులకు ఎవరైనా సహకరించినట్లు సమాచారం ఇస్తే రూ. 2 వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని శుక్రవారం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాడని బాధితులు తెలిపారు.