ఓరుగల్లుకు మొండిచేయి ఎంపీ ఎలక్షన్‍ బీజేపీ మేనిఫెస్టోలోని ఒక్క ప్రాజెక్ట్​రాలే

ఓరుగల్లుకు మొండిచేయి  ఎంపీ ఎలక్షన్‍  బీజేపీ మేనిఫెస్టోలోని ఒక్క ప్రాజెక్ట్​రాలే
  • ప్రచారంలో ప్రధాని, కేంద్ర మంత్రులు, నేతల హామీలన్నీ ఉత్తిమాటలే
  • ఎంపీలు కావ్య, బలరాం నాయక్‍ ప్రతిపాదనలు పట్టించుకోని కేంద్రం

వరంగల్‍, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఓరుగల్లుకు మొండిచేయి చూపింది. దేశంలో మరోసారి మోదీ సర్కార్‍ వస్తే ఓరుగల్లు అభివృద్ధికి ఏఏ ప్రాజెక్టులు తీసుకురానున్నారో తెలుపుతూ మొన్నటి లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మేనిఫెస్టో తయారు చేశారు. వరంగల్‍, మహబూబాబాద్‍ కమలం పార్టీ ఎంపీ అభ్యర్థులు ఆరూరి రమేశ్‍, అజ్మీరా సీతారాం నాయక్‍ వీటిని జనాల ముందు పెట్టి ఓట్లు అడిగారు. ఈ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, సీనియర్‍ నేతలు ఉమ్మడి జిల్లా అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిన హామీలకు బడ్జెట్‍లో ఒక్క రూపాయి కేటాయించలేదు.  

  • ఓరుగల్లు ప్రాజెక్టులను లెక్కచేయలే..

ఓరుగల్లులోని ఆరు జిల్లాలకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‍లో లెక్క చేయలేదు. ఇందులో ప్రధానంగా ఉత్తర దక్షిణ కూడలిగా ఉండే కాజీపేట రైల్వే జంక్షన్‍ను ప్రత్యేక డివిజన్‍గా ఏర్పాటు చేయాలనే ఊసే లేదు. విభజన హామీల్లో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించలేదు. గిరిజన యూనివర్సిటీ పూర్తి చేయడానికి కావాల్సిన మొత్తం ఫండ్స్​కేటాయించలేదు. పీఎం మిత్రలో ప్రకటించిన మెగా టెక్స్​టైల్​ పార్క్​అభివృద్ధి టాపిక్కే లేదు. ఇండస్ట్రీయల్‍ కారిడార్‍, జిల్లాల్లో సైనిక్‍, నవోదయ స్కూల్స్, ఐఐఎం ఏర్పాటు జాడే లేదు. రామప్ప టెంపుల్‍కు యునెస్కో గుర్తింపు, ఉమ్మడి జిల్లాలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో టూరిజం డెవలప్‍మెంట్‍ చేస్తామన్న కేంద్ర మంత్రుల హామీ ఉట్టిదే అయింది. మొన్నటి ఎంపీ ఎలక్షన్‍లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‍ పార్టీలు కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాలో ఉన్న పెండింగ్‍ ప్రాజెక్టులను తీసుకొస్తామని మేనిఫెస్టో తయారు చేసి ప్రచారం చేశారు. తీరా అధికారంలో ఉన్న మోదీ సర్కారు బడ్జెట్‍లో వీటిని పరిగణలోకి తీసుకోలేదు.  

  • ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆరూరి మేనిఫెస్టో

వరంగల్‍ మహా నగరానికి అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ మంజూరు
  మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​పున:ప్రారంభం
 సమ్మక్క - సారక్క జాతరకు జాతీయ హోదా
  కాజీపేట రైల్వే డివిజన్‍, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
  కాకతీయ మెగా టెక్స్​టైల్​పార్క్​అభివృద్ధికి స్పెషల్‍ ఫండ్స్​
  వరంగల్‍_హైదరాబాద్‍ ఇండస్ట్రీయల్‍ కారిడార్‍
  కొత్త జిల్లాల్లో నవోదయ గురుకులాల ఏర్పాటు
  భూపాలపల్లి నుంచి పరకాలకు రైల్వేలైన్‍ అనుసంధానం
  పత్తి, మిర్చి, పసుపు, ఉద్యానవనాల అభివృద్ధికి వస్త్ర పరిశోధన కేంద్రం
  ఓరుగల్లులో ఐఐఎం ఏర్పాటు
  శాయంపేట, సంగెం, రఘునాథపల్లి ప్రాంతాల్లో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం

ALSO READ : బడ్జెట్ లో పర్యావరణానికి రూ.3,330 కోట్లు

  • ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్‍ ప్రతిపాదనలు

  కాజీపేటకు రైల్వే డివిజన్‍ హోదా కల్పించాలి
  మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​పున:ప్రారంభానికి త్వరగా 
చర్యలు తీసుకోవాలి
  కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్కు అభివృద్ధికి స్పెషల్‍ ఫండ్స్​ 
  మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి
  బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించాలి
  గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో స్మార్ట్​సిటీ, హృదయ్‍ పథకాలకు 
ఎక్కువ ఫండ్స్​కేటాయించాలి
  హనుమకొండ జిల్లా ధర్మసాగర్‍ ఎలుకుర్తిలో సైనిక్‍ స్కూల్‍ నిర్మించాలి
  కొత్త జిల్లాలకు నవోదయ స్కూల్‍ కేటాయించాలి.. 
వంటి ఎన్నో ప్రతిపాదనలు చేశారు.