
హైదరాబాద్: కోడి పందాలు, క్యాసినో కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 2025, మార్చి 14న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం (మార్చి 13) హైటెక్ సిటీ అపర్ణా ఆర్చిడ్స్లోని పోచంపల్లి నివాసానికి వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేశారు.
కాగా, 2025 ఫిబ్రవరి 11న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ ఐ.కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమారెడ్డి 50 మంది సిబ్బందితో కలిసి పందేల శిబిరంపై దాడి చేశారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మొయినాబాద్ పీఎస్కు తరలించారు.
అయితే.. కోడి పందెలు నిర్వహించిన ఫామ్ హౌస్ను ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శివకుమార్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫామ్హౌస్ ఓనర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఫిబ్రవరి 13న పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో తన న్యాయవాది ద్వారా పోలీసుల నోటీసులకు రిప్లై పంపించారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. తాజాగా ఇదే కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ సారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరీ పోలీసుల విచారణకు పోచారం హాజరు అవుతారా..? లేదా..? అన్నది చూడాలి.