- చెరువు శిఖం భూమిలో కడుతున్న
- బిల్డింగ్ పనులు ఆపాలని ఆదేశాలు
- నిర్మాణ స్థలంలో మాజీ ఎమ్మెల్యే గండ్రను ఉద్దేశిస్తూ హెచ్చరిక బోర్డు
- ఆగిన రూ.10 కోట్ల బిల్డింగ్ పనులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి చెందిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి స్థానిక మున్సిపల్ ఆఫీసర్లు షాక్ ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు శిఖం భూమిలో కడుతున్న బిల్డింగ్ పనులను ఆపేయాలని బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని కొంపెల్లి శివారులో ఉన్న గొరంట్ల కుంట చెరువు శిఖానికి సంబంధించిన 209 సర్వే నంబర్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ పనులను ఆపేయాలని మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.
వారం రోజుల్లో నోటీసుకు వివరణ ఇవ్వాలని, లేకపోతే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్ 178(2), (8), 181ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. కొత్తగా కడుతున్న బిల్డింగ్ గోడలకు కూడా నోటీసులు అంటించారు. ‘మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్న బిల్డింగ్ స్థలం చెరువు శిఖం భూమి కావడంతో పాటు ఈ సర్వే నంబర్లోని 22.38 గుంటల స్థలంపై ఇది వరకే హైకోర్టులో కేసు నడుస్తోంది. అందుకని, ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు’ అని భూపాలపల్లి తహసీల్దార్..మాజీ ఎమ్మెల్యే గండ్ర బిల్డింగ్ ముందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో రెండు ఫ్లోర్ల స్లాబ్ వేసి మూడో ఫ్లోర్ స్లాబ్ కోసం చెక్క కొట్టి ఉంచిన బిల్డింగ్ పనులు ఆగిపోయాయి.