
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం కళాశాలలే స్వయంగా ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తాయి. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరుతో ఐఐఎంలే కాకుండా పేరున్న కాలేజీలు అడ్మిషన్స్ కల్పిస్తాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు: అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, బోధ్ గయా, కోల్కతా, ఇండోర్, జమ్ము, కాశీపూర్, కోజికోడ్, లఖ్నవూ, నాగ్పుర్, రాయ్పూర్, రాంచీ, రోహ్తక్, సంబల్పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచిరాపల్లి, ఉదయపూర్, విశాఖపట్నం.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు ఉన్నా అర్హులే). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటీవ్ ఎబిలిటీలో విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సిటీల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 150 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ రూ.2300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1150) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష నవంబర్ 27న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.iimcat.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.