
- బాధితులకు సత్వర సేవలు అందించడంలో మేనేజ్మెంట్ ఫెయిల్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు: రామగుండం అక్బర్ నగర్లో బుధవారం రాత్రి బూడిద పైపులైన్ పగిలి చుట్టు పక్కల ఇండ్లల్లోకి బూడిద నీరు చేరిన ఘటన పూర్తిగా ఎన్టీపీసీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం రాత్రి ఆయన అక్బర్ నగర్లో బూడిద నీటి పైపులైన్ పగిలిన ప్రాంతాన్ని, బూడిద నీరు చేరి డ్యామేజ్ అయిన ఇండ్లను పరిశీలించారు. బాధితులను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పైపులైన్ పగిలి బూడిద నీరు సమీప ఇండ్లల్లోకి చేరితే ఎన్టీపీసీ అధికారులు బాధిత కుటుంబాలకు సత్వర సహాయం అందించడంలో ఫెయిల్ అయ్యారని ఎంపీ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని, డ్యామేజ్ అయిన ఇండ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికి వెలుగులు అందించడానికి అవసరమైన భూములను ఎన్టీపీసీకి అప్పగించిన నిర్వాసితులను మాత్రం ఆ సంస్థ చీకట్లో ఉంచుతున్నదని, ఇది సరైంది కాదని ఫైర్ అయ్యారు. బూడిద పైపులైన్ పగిలిన ఘటనపై ఎంక్వైరీ చేసి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు గురువారం లేఖ రాశారు. ఎన్టీపీసీ అధికారుల ఫెయిల్యూర్ వల్లే ఇది జరిగిందని.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని, తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు.