అసెంబ్లీకి వెళ్లిన మహిళలు ఐదుగురే .. ఓట్లు ఎక్కువున్నా  దక్కని ప్రాతినిధ్యం 

అసెంబ్లీకి వెళ్లిన మహిళలు ఐదుగురే .. ఓట్లు ఎక్కువున్నా  దక్కని ప్రాతినిధ్యం 
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో చాన్స్​ఇవ్వని పార్టీలు  

మెదక్,  సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువున్నా  అసెంబ్లీకి  వారి ప్రాతినిధ్యం మాత్రం  చెప్పుకోదగ్గస్థాయిలో లేదు.  మొదటి నుంచి రాజకీయపార్టీలు మహిళలకు టికెట్​ ఇవ్వడానికి  వెనకాముందాడుతున్నాయి.  1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు.  అయితే  ఈ ఐదుగురిలో  ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా, ఒకరు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.   

రెండు చోట్ల  నుంచి  పద్మ ఎన్నిక 

మెదక్ జిల్లానుంచి ముగ్గురు మహిళలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.  1962 అసెంబ్లీ ఎన్నిల్లో మెదక్​నుంచి  సీపీఐ పార్టీ క్యాండిడేట్​గా పోటీ చేసిన కేవల్​ ఆనందాదేవి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.   టీడీపీ హయాంలో మెదక్​ నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన  కరణం రాంచందర్​రావ్​చనిపోవడంతో  2002 లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో   రాంచందర్ రావ్​ భార్య కరణం ఉమాదేవి టీడీపీ నుంచి పోటీ చేసి  గెలిచారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత   2014, 2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన పద్మా దేవేందర్​రెడ్డి వరుసగా రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె  తెలంగాణ అసెంబ్లీ తొలి డిప్యూటీ స్పీకర్​గా  పనిచేశారు.  పద్మా దేవేందర్​రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో  2004 ఎన్నికల్లో  రామాయంపేట నుంచి కూడా  టీఆర్​ఎస్​క్యాండిడేట్​గా గెలిచారు. ఉద్యమకాలంలో టీఆర్ ఎస్​ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయగా  2008లో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లోనూ పద్మ పోటీ చేసినా ఓడిపోయారు.    

నర్సాపూర్​లో సునీతారెడ్డి హ్యాట్రిక్​ 

నర్సాపూర్​అసెంబ్లీ స్థానంలో వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  శివ్వంపేట జడ్పీటీసీగా ఉన్న ఆమె భర్త లక్ష్మారెడ్డి ప్రమాదంలో మరణించగా ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు.  1999  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఆమెకు నర్సాపూర్​నుంచి  టికెట్ ఇవ్వగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ   కాంగ్రెస్​అభ్యర్థిగా  గెలుపొంది హ్యాట్రిక్​ కొట్టారు.  కాంగ్రెస్​ ప్రభుత్వంలో సునీతారెడ్డి రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో  పోటీ చేసి ఓడిపోయారు.  

గజ్వేల్​, జహీరాబాద్​ల నుంచి గీతారెడ్డి  

 సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని గజ్వేల్​, జహీరాబాద్​ఎస్సీ రిజర్వ్​డ్​అసెంబ్లీ స్థానాల నుంచి  జె. గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు.   గజ్వేల్‌‌‌‌ నుంచి 1989, 2004 ఎన్నికల్లో  గీతారెడ్డి గెలిచారు.  1994,1999 ఎన్నికల్లో   పోటీ చేసినా  ఓటమి చెందారు.  అసెంబ్లీ స్థానాల పునర్విభజనలో జహీరాబాద్​ ఎస్సీలకు రిజర్వు కాగా  2014 లో ఇక్కడ నుంచి కాంగ్రెస్​ క్యాండిడేట్​గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.   2018 ఎన్నికల్లో ఓడిపోయారు. గీతారెడ్డి  సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు.  2018 లో సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీజెఎస్ అభ్యర్థిగా భవానిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ప్రధాన పార్టీల ఇతర నియోజకవర్గాల్లో మహిళలెవరికీ టికెట్లు ఇవ్వలేదు.  పలువురు మహిళలు ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.