నర్సు శృతిది ఆత్మహత్యే..

నర్సు శృతిది ఆత్మహత్యే..
  • ప్రియుడు పెండ్లికి నిరాకరించడంతో హోటల్​ గదిలో సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలిలోని రెడ్​స్టోన్ ​హోటల్​లో ఈ నెల16న మృతి చెందిన నర్సు శ్రుతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పోలీసులు తేల్చారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లకు చెందిన గొల్ల శ్రుతి(23) నర్సింగ్​ పూర్తి చేసింది. రెండేండ్ల కింద పాలమూరులో డ్రైవింగ్​ నేర్చుకునే టైంలో డ్రైవింగ్​స్కూలులో పనిచేసే జీవన్​పాల్(26)తో ప్రేమలో పడింది. ఈ నెల 14న శృతి, జీవన్​పాల్, వారి ఫ్రెండ్స్​ మౌనిక, వెంకటేశ్ కలిసి గచ్చిబౌలికి వచ్చారు. 

నిమజ్జనాలు చూసేందుకు వచ్చామని రెడ్​స్టోన్​ హోటల్​లో రెండు రూమ్స్​ తీసుకున్నారు. 15న రాత్రి నలుగురు కలిసి మద్యం తాగారు. తనను పెండ్లి చేసుకోవాలని శృతి..జీవన్​పాల్​ను అడిగింది. జీవన్ పాల్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే టైంలో జీవన్​కు మరో ఇద్దరు యువతుల నుంచి కాల్స్ ​రావడంతో నిలదీసింది. మనస్తాపానికి గురై మరో గదికి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతసేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో నిద్రపోయిందనుకుని జీవన్​పాల్, మౌనిక, వెంకటేశ్ ​అర్ధరాత్రి సికింద్రాబాద్​లో నిమజ్జనం చూసేందుకు వెళ్లారు. 

తెల్లవారుజామున 3 గంటలకు హోటల్​కు వచ్చి డోర్ ​కొడితే తీయకపోవడంతో ​సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి మాస్టర్​ కీతో ఓపెన్ చేయగా అప్పటికే శ్రుతి చనిపోయి సీలింగ్​ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. తమ బిడ్డది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో శ్రుతిది ఆత్మహత్య అని తేలిందని పోలీసులు గురువారం వెల్లడించారు. జీవన్​పాల్​మీద కేసు ఫైల్​చేసి, రిమాండుకు తరలించినట్లు చెప్పారు.