SL vs IND 2024: శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో జూనియర్ మలింగ ఔట్

SL vs IND 2024: శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో జూనియర్ మలింగ ఔట్

సొంతగడ్డ మీద భారత్ పై సిరీస్ గెలవాలనే శ్రీలంక ఆశలు ఆవిరైపోయేలా కనిపిస్తున్నాయి. వరుస గాయాలు ఆ జట్టును వేధిస్తున్నాయి. బుధవారం (జూలై 24) సీనియర్ పేసర్ దుష్మంత చమీర దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో అసిత ఫెర్నాండోకు స్థానం దక్కింది. అయితే తాజాగా మరో యువ పేసర్ నువాన్ తుషార గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెర్ బోర్డు గురువారం (జూలై 25) ప్రకటించింది. 

బుధవారం (జూలై 24) ప్రాక్టీస్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తుషార ఎడమ బొటన వేలికి గాయమైంది. అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్  దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో తుషార అదరగొట్టాడు. మూడు మ్యాచ్ ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి తన మార్క్ చూపించాడు. లంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ తో తుషార అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. శ్రీలంక క్రికెట్ టీ20 సిరీస్ కు 16 మందితో కూడిన స్క్వాడ్ ను మంగళవారం (జూలై 23) ప్రకటించింది.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్‌, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.  

భారత్ సిరీస్ కోసం శ్రీలంక టీ20 జట్టు

చరిత్ అసలంక (కెప్టెన్ ), పాతుమ్ నిస్సాంక, కుసల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్నాండో,  బి. ఫెర్నాండో