కేసీఆర్​ సభ కోసం పంట నాశనం చేసిన దళితరైతు

కేసీఆర్​ సభ కోసం పంట నాశనం చేసిన దళితరైతు

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఈనెల 15న నిర్వహించే బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారసభ కోసం ఓ దళితరైతు పంటను నాశనం చేశారు. ఎకరం భూమిలో తాను సాగుచేసుకుంటున్న నువ్వుల పంటలో మన్ను పోశారని ఎనగందుల లక్ష్మినారాయణ  ఆరోపించాడు.. మరికొద్ది రోజుల్లో చేతికి వచ్చే పంటను ధ్వంసం చేసి తన నోట్లో మట్టికొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేమని అడిగితే దబాయిస్తున్నారని వాపోతున్నాడు. న్యాయం చేయాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 

సీఎం కేసీఆర్​ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు హుస్నాబాద్​ను ఎంచుకున్నారు. ఇందుకు సభాస్థలం వాస్తు ప్రకారం ఉండాలని సూచించడంతో మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ రెండుమూడు స్థలాలను పరిశీలించారు. ముందుగా హనుమకొండరోడ్డులోని పోతారం(ఎస్​)లో స్థలాన్ని పరిశీలించారు. అక్కడ వాస్తు సరిగా లేదని బస్​డిపో గ్రౌండును చూశారు. అదీ బాగాలేదని కరీంనగర్​ రోడ్డులోని విద్యుత్​ సబ్​స్టేషన్​ వద్ద స్థలాన్ని ఎంపికచేశారు. ఆ స్థలంలో ఎకరం నువ్వులపంట ఉన్నా దానిని బ్లేడ్​బండ్లతో తొలగించారు.  చేతికి వచ్చిన పంటను నాశనం చేయడంతో రైతు ఎనగందుల లక్ష్మినారాయణ తీవ్రంగా బాధపడుతున్నాడు.