
కొలంబో: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నాహకాలు మొదలు పెడుతోంది. ఇందులో భాగంగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, సౌతాఫ్రికాతో జరిగే వన్డే ట్రై సిరీస్లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది.
మెగా టోర్నీ నేపథ్యంలో బ్యాటింగ్పై పెద్దగా ఆందోళన లేకపోయినా.. బౌలింగ్ వనరులను మరోసారి సమీక్షించుకోవాలని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ భావిస్తోంది. అండర్–19 టీ20 వరల్డ్ కప్లో రాణించిన సీమర్ కశ్వీ గౌతమ్పై అందరి దృష్టి నెలకొంది. డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన కశ్వీ 9 మ్యాచ్ల్లో 6.45 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీసింది.
హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డిపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ మీడియం పేసర్గా రాణిస్తే ఇండియా బౌలింగ్ కష్టాలు తీరినట్లే. అయితే స్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ప్రేమదాస స్టేడియంలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి కచ్చితంగా ప్రభావం చూపిస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రీలంక నలుగురు కొత్త ప్లేయర్లతో ఈ సిరీస్కు రెడీ అయింది.