పుట్టినవారు గిట్టక తప్పదు.. మరణించిన వారు జన్మించక తప్పదని భగవద్గీత చెబుతుంది. మనుషులు జీవించి ఉన్నంతరకే కులం, మతం లాంటి వాటి గురించి మాట్లాడుకుంటారు. ఇంకా మరణించిన తరువాత అంత్యక్రియలను వారి వారి సంప్రదాయాలను ఆచరించి చేయడం సాధారణం. ప్రాణం పోయిన వారికి అంతిమ సంస్కారాలు చేసే ప్రదేశాన్ని స్మశానంగా పిలుస్తారు. ఎవరు మరణించినా స్మశానానికి తీసుకురావాల్సిందే.. కాని ఒడిశాలోని కేంద్రపర మున్సిపాల్టీలో స్మశానవాటికలో కూడా కులతత్వం పాటిస్తున్నారు. ప్రాచీన మున్సిపాల్టీలోని హజరీబగిచా ప్రాంతంలో స్మశానం ప్రారంభంలోనే బ్రాహ్మిణ్ స్మశాన వాటిక అని సూచిస్తూ ప్రత్యేకించి బోర్డు పెట్టారు. ఈ స్మశాన వాటిక గత కొన్నేళ్లుగా బ్రాహ్మణుల దహనవాటికగా ఉపయోగపడుతోంది. అయితే ప్రభుత్వ నిధులతో ఇటీవలనే సౌకర్యాలతో పునరుద్ధరించిన తరువాత ప్రత్యేకించి బోర్డు పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇతర కులాల వారు తమ బంధువులు ఎవరైనా చనిపోతే సమీపాన ఉన్న మరో స్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటారు. ఆ స్మశాన వాటిక కూడా పునరుద్ధరించడమైంది. ప్రత్యేకించి బ్రాహ్మణులకే ఈ దహనవాటిక అని బోర్డు పెట్టి కులతత్వం పాటించడం స్థానికంగా మిగతా కులాల వారు మండిపడుతున్నారు. కేంద్రపర మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రఫుల్ల చంద్ర బిస్వాస్ ఈ వివాదంపై మాట్లాడుతూ ఈ విచక్షణ లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. దళిత హక్కుల ఉద్యమనేతలు, రాజకీయ నాయకులు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విధంగా చేయడం కులవిభేదాలను రెచ్చగొట్టడమేనని ధ్వజమెత్తుతున్నారు.