ఆఫీసు జాగాకు కొరత.. డిమాండ్​ మాత్రం యదాతథం

ఆఫీసు జాగాకు కొరత.. డిమాండ్​ మాత్రం యదాతథం

న్యూఢిల్లీ: డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి–-మార్చి కాలంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలం కొత్త సరఫరా ఒక శాతం తగ్గి 99 లక్షల చదరపు అడుగులకు చేరుకుందని రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ కొలియర్స్​ తెలిపింది. దీని రిపోర్టు ప్రకారం...గత ఏడాది ఇదే కాలంలో ఆఫీసు స్థలం కొత్త సరఫరా కోటి చదరపు అడుగులుగా ఉంది.  

బెంగళూరులో కొత్త సరఫరా మార్చి క్వార్టర్​లో 16 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో 44 లక్షల చదరపు అడుగుల నుంచి 37 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. చెన్నైలో 3 లక్షల చదరపు అడుగుల నుంచి 2 లక్షల చదరపు అడుగులకు.. అంటే 33 శాతం తగ్గుదల కనిపించింది. ఢిల్లీ–ఎన్సీఆర్​లో​ సరఫరా 5 లక్షల చదరపు అడుగుల నుంచి 27 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ఏడాది లెక్కన ఐదు రెట్లు పెరిగింది. 

హైదరాబాద్‌‌లో కొత్త సరఫరా 26 లక్షల చదరపు అడుగుల నుంచి 3 లక్షల చదరపు అడుగులకు (88 శాతం) తగ్గింది. కోల్‌‌కతాలో కొత్త ఆఫీసు సరఫరా 50 శాతం తగ్గింది. ఇది 2 లక్షల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగులకు పడిపోయింది. ముంబైలో కొత్త ఆఫీసు స్థలం సరఫరా 10 లక్షల చదరపు అడుగుల నుంచి 4 లక్షల చదరపు అడుగులకు.. అంటే 60 శాతం తగ్గింది. 

పూణేలో గత ఏడాది ఇదే కాలంలో 10 లక్షల చదరపు అడుగుల నుంచి ఈ ఏడాది జనవరి-–మార్చిలో 2.5 రెట్లు పెరిగి 25 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. 2025 క్యాలెండర్ సంవత్సరం మొదటి క్వార్టర్​లో ఈ ఏడు నగరాల్లో ఆఫీసు స్థలం స్థూల లీజింగ్ గత ఏడాది ఇదే కాలంలో 138 లక్షల చదరపు అడుగుల నుంచి  ఈసారి15 శాతం పెరిగి 159 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.