
- ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, సిబ్బంది
- ఇబ్బందులు పడుతున్న ఎమర్జెన్సీ పేషెంట్లు
వరంగల్/వరంగల్సిటీ, వెలుగు: రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో అనధికారిక వీకెండ్ హాలీడేస్ అమలవుతున్నాయి. శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు.. మెజార్టీ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు డ్యూటీలకు రావడం లేదు. కొందరు అసలు ఎంజీఎంవైపే కన్నెత్తి చూడకపోగా మరికొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఆఫీసర్లు లేరని హెచ్వోడీలు, హెచ్వోడీలు లేరని డాక్టర్లు, డాక్టర్లు లేరని కింది స్థాయి సిబ్బంది సైతం విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇవేమీ తెలియక వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎమర్జెన్సీ పేషెంట్లు అయితే గంటల తరబడి నరకం అనుభవిస్తున్నారు.
డాక్టర్లు లేక ఆగుతున్న స్కానింగ్లు
ఎంజీఎంలో ప్రతి రోజు 200 నుంచి 300 మంది పేషెంట్లకు ఎక్స్రే, స్కానింగ్లు నిర్వహిస్తుంటారు. గతంలో కరెంట్ సమస్య ఉండి స్కానింగ్కు ఇబ్బంది కలగడంతో జనరేటర్ సౌకర్యం కల్పించారు. శని, ఆది వారాల్లో డాక్టర్లు డ్యూటీలకు రాకపోవడం, పేషెంట్ల కండీషన్ నిర్ధారణ కాకపోవడంతో టెక్నీషియన్లు స్నానింగ్, ఎక్స్రే చేయకుండా ఆపుతున్నారు. డాక్టర్లు ఎప్పుడు వస్తారో.. తమకు స్కానింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక పేషెంట్లు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
ఆర్ఎంవో లేడని.. ఆరోగ్యశ్రీ డబ్బులిస్తలే...
వరంగల్ ఎంజీఎంలో సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో పాటు ముగ్గురు ఆర్ఎంవోలు మల్లికార్జున్, మురళీ, దిలీప్కుమార్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లక్ష్మీరాజ్యం ఉన్నారు. సెలవులు, షిఫ్టుల ఆధారంగా వీరు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన పేషెం ట్లు డిశ్చార్జి టైంలో ప్రయాణ ఖర్చులతో పాటు, ప్రైవేట్లో చేసుకున్న టెస్టులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలి. ఈ పేపర్లపై ఆర్ఎంవో స్థాయి ఆఫీసర్లు సంతకం చేస్తే సిబ్బంది డబ్బులు చెల్లిస్తారు. కానీ వీకెండ్స్లో ఆర్ఎంవో ఉండకపోవడంతో ఆరోగ్య శ్రీ పేషెంట్లకు డబ్బులు ఇవ్వడం లేదు.
వరంగల్ జిల్లా సంగెం మండలానికి చెందిన మునిగాల రమేశ్ కాలు విరగడంతో శనివారం ఎంజీఎంకు వచ్చాడు. ఎంతసేపు ఎదురు చూసినా సిబ్బంది కనిపించకపోవడంతో పాటు కనీసం వీల్చైర్లు కూడా అందుబాటులో లేవు. దీంతో ఇద్దరు వ్యక్తులు భుజాలపై మోస్తుండగా, విరిగిన కాలు కిందపెట్టకుండా ఓ మహిళ టవల్తో పట్టుకొని హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక డాక్టర్ లేకపోవడంతో గంటల తరబడి హాస్పిటల్లోనే పడిగాపులు పడ్డారు.
చెన్నారావుపేట మండలం సూర్యతండాకు చెందిన ధరావత్ వెంకటేశ్ కూతురు సాత్విక ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద ఫిబ్రవరి 26న ఎంజీఎంలో అడ్మిట్ చేసి మార్చి 3న డిశ్చార్జి చేశారు.
ఎంజీఎంలో కొన్ని మందులు, టెస్టులు లేకపోవడంతో డాక్టర్ల సూచన మేరకు బయట చేయించారు. వీటికి సంబంధించి రూ. 1,250 ఇవ్వాల్సి ఉండగా ఆర్ఎంవో సంతకం కోసం శనివారం హాస్పిటల్కు వచ్చారు. శని, ఆదివారాలు సార్లు ఉండరని సిబ్బంది చెప్పడంతో ఇంటి బాట పట్టారు.