ఉరుకులు.. పరుగులు.. ఉదయం 8 గంటలకే టన్నెల్​ వద్దకు చేరుకున్న ఆఫీసర్లు

ఉరుకులు.. పరుగులు.. ఉదయం 8 గంటలకే టన్నెల్​ వద్దకు చేరుకున్న ఆఫీసర్లు
  • అందుబాటులో అంబులెన్సులు
  • అధికారులతో నాగర్​కర్నూల్​ కలెక్టర్  రివ్యూ​

ఎస్ఎల్​బీసీ, వెలుగు టీం: ఎస్ఎల్​బీసీ టన్నెల్​ వద్ద శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకే ఆఫీసర్లు చేరుకున్నారు. దాదాపు 9 గంటల వరకు అన్ని డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు వచ్చారు. అయితే 9 గంటల ప్రాంతంలో అంబులెన్సులు వచ్చాయి. దీని వెనకాలే.. సంచార వైద్యశాల వాహనం కూడా టన్నెల్​ వద్దకు చేరుకుంది. ఈ వాహనాలు వచ్చిన కొద్ది సేపటికే రెండు టీమ్​ల డాక్టర్ల బృందం టన్నెల్​ వద్దకు పోయింది. 

10 గంటల ప్రాంతంలో సింగరేణి రెస్య్కూ అండ్​ మైన్స్​ ఆపరేషన్​ టీమ్​ నుంచి 50 మంది టన్నెల్​ వద్దకు వెళ్లారు. పదిన్నరకు టన్నెల్​ కాంట్రాక్ట్​ కంపెనీకి చెందిన జయప్రకాశ్​ గౌర్​ హెలికాప్టర్​ ద్వారా హెలిప్యాడ్​ వద్దకు చేరుకున్నారు. కంపెనీకి చెందిన కొందరితో మాట్లాడి.. పది నిమిషాల్లోనే తిరిగి హెలికాప్టర్​లో వెళ్లిపోయారు.  పదిన్నర గంటలకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ జేపీ క్యాంప్​ ఆఫీస్​ వద్దకు వెళ్లారు. 

అక్కడి నుంచి టన్నెల్​ వద్దకు వెళ్లి సహాయక చర్యలపై సమీక్షించారు.  మధ్యాహ్నం 12 గంటల సమయంలో సింగరేణి రెస్య్కూ అండ్​  మైన్స్​ ఆపరేషన్​ టీమ్​ చెందిన 200 మంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మంచిర్యాల, గోదావరిఖని నుంచి వచ్చారు.  టన్నెల్​ వద్ద ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ అండ్​ మైన్స్​ ఆపరేషన్​ సిబ్బంది 24 గంటలు సహాయక చర్యల్లోనే పాల్గొంటున్నారు. అయితే సాయంత్రం నాగర్​కర్నూల్​ డిప్యూటీ డీఎంహెచ్​వో తారాసింగ్​ టన్నెల్​ వద్దకు చేరుకున్నారు. అలాగే ప్రమాదంలో గల్లంతైన గురుప్రీత్​సింగ్​ బాబాయ్​లు ఇద్దరు టన్నెల్​ వద్దకు వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో సింగరేణి రెస్య్కూ అండ్​ మైన్స్​ ఆపరేషన్​ టీమ్​కు చెందిన మరో టీమ్​ టన్నెల్​లోకి వెళ్లింది. 

సహాయక చర్యలు కొనసాగుతున్నాయ్..

టన్నెల్​ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నాగర్​కర్నూల్​ కలెక్టర్​ బదావత్​ సంతోష్​​తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్  రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైడ్రా, సౌత్  సెంట్రల్  రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్  హోల్​ మైనర్స్ టీమ్​ల మధ్య సమన్వయంతో సహాయక చర్యల్లో వేగం పెరిగిందన్నారు. 

గల్లంతైన బాధితులను గుర్తించేందుకు లేటెస్ట్​ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. ప్రమాద ప్రదేశంలోని నీటిని పైపుల ద్వారా బయటికి తరలిస్తూ, ప్లాస్మా గ్యాస్  కటర్లతో శిథిలాలను కట్ చేయిస్తున్నామన్నారు. కన్వేయర్  బెల్ట్ ను ఉపయోగంలోకి తీసుకురానున్నామన్నారు. బురదను తీసేందుకు ఎస్కవేటర్లు టన్నెల్​లోకి పంపించామని, ప్రత్యేక కెమెరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన వివరించారు.