భద్రాద్రిలోకి చుక్కనీరు రానీయలే!

భద్రాద్రిలోకి చుక్కనీరు రానీయలే!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం టౌన్​లోకి గోదావరి నుంచి చుక్కనీరు రానీయకుండా అడ్డుకోవడంలో ఆఫీసర్లు సక్సెస్​ అయ్యారు. కరకట్టలపై ఉన్న స్లూయిజ్​ల నుంచి వరద నీరు వచ్చి రామాలయం పరిసరాలు, సుభాష్​నగర్​ కాలనీ, అశోక్​నగర్​ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు మునిగేవి. కానీ ఈసారి నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైనే ఫోకస్​ పెట్టారు. స్లూయిజ్​ల వద్ద ఇసుక బస్తాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా ఎత్తిపోసేలా మోటార్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు.

మరో వైపు కూనవరం రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కరకట్ట నిర్మాణం జరుగుతోంది. అటు వైపు నుంచి వరద టౌన్​లోకి రాకుండా విజయవాడ–-జగదల్​పూర్​ జాతీయ రహదారిని సరస్వతీ శిశుమందిర్​ వద్ద మట్టి కట్ట పోశారు. వరద తగ్గాక ఈ కట్టను తొలగించనున్నారు. ఈ జాగ్రత్తలతో టౌన్​లోకి వరద నీరు రాలేదు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాటిని సీఐ సంజీవరావు ఆధ్వర్యంలో పోలీసులు ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్​ చేయించారు. 51.60 అడుగుల గరిష్ఠ వరద వచ్చినా టౌన్​లోకి నీరు రాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.