
- ఇప్పటివరకు 50 శాతమే వసూలు
- మరో మూడు రోజులే గడువు
- బకాయిల చెల్లింపులకు మొండికేస్తున్న పబ్లిక్
- ఇండ్లకు తాళాలు వేస్తున్నా.. నో రెస్పాన్స్
- ఆర్థిక ఇబ్బందుల్లో మున్సిపాలిటీలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 2024-–25 ఆర్థిక సంవత్సరం గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో ఈలోగా వందశాతం ట్యాక్స్ వసూలుకు ట్రై చేస్తున్నారు. మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక టీములను నియమించి కలెక్షన్ స్పీడప్ చేశారు.
కొన్నేండ్లుగా వేలల్లో బకాయిపడ్డవారికి రెడ్ నోటీసులు జారీ చేసి ఆస్తులు జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ బిల్డింగ్ ఓనర్ల నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సర్కారీ ఆస్తులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఓవైపు ప్రభుత్వం వందశాతం ట్యాక్స్వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు ఆశించినంత కలెక్షన్ లేకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు.
మున్సిపాలిటీల వారీగా బకాయిలు
2024-–25 ఆర్థిక సంవత్సరంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 5 మున్సిపాలిటీల్లో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో రూ.26.88 కోట్ల డిమాండ్కు గాను ఇప్పటివరకు రూ.13 కోట్లు (50 శాతం) మాత్రమే వసూలైంది. మంచిర్యాల గ్రేడ్1 మున్సిపాలిటీని ఇటీవల కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తూ నస్పూర్ మున్సి పాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేయడం తెలిసిందే. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రూ.4 కోట్ల ట్యాక్స్ డిమాండ్ ఉండగా, రూ.2.69 కోట్లు వసూలు చేశారు.
మందమర్రి మున్సిపాలిటీలో రూ.2.30 కోట్లకు గాను రూ.1.61 కోట్ల కలెక్షన్ సాధించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో రూ.3.38 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.2.12 కోట్లు రాబట్టగలిగారు. చెన్నూర్ మున్సి పాలిటీలో రూ.2.86 కోట్లకు రూ.1.60 కోట్లు వసూలైంది. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో రూ.1.69 కోట్లకు గాను రూ.1.36 కోట్ల (81 శాతం) కలెక్షన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టాప్లో నిలిచింది.
వడ్డీ రాయితీ ప్రకటించిన సర్కారు
మున్సిపాలిటీల్లో భారీగా పేరుకుపోయిన బకాయిలను రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఇటీవల వడ్డీ రాయి తీని ప్రకటించింది. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద బకాయిలను క్లియర్ చేసినవారికి వడ్డీపై 90 % రాయితీ ఇస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు చెల్లించిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం ట్యాక్స్లో రాయితీ వర్తిస్తుంది. అయితే, మూడు రోజులు మాత్రమే గడువు ఉండడం, పండుగ సెలవులు రావడంతో ఎంతమేరకు వసూలు అవుతుందనేది అనుమానమే. ఈ ఉత్తర్వులు 15 రోజుల ముందు ఇచ్చి ఉంటే పన్ను చెల్లిం పుదారులకు వెసులుబాటు లభించేది.
ఆర్థిక సమస్యల్లో మున్సిపాలిటీలు
డిమాండ్కు అనుగుణంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ కాకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు నిలిచిపోవడం వల్ల మున్సిపాలిటీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15 ఫైనాన్స్ నిధులు నిలిచిపోగా, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి ఫండ్స్ సైతం రెగ్యులర్గా రిలీజ్ చేయడం లేదు.
ఈ క్రమంలో ప్రాపర్టీ ట్యాక్స్ పైనే మున్సిపాలిటీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ మొత్తాన్ని జనరల్ ఫండ్లో జమచేసి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపుతో పాటు ఇతర అవసరాలకు వాడుకునే వెసు లుబాటు ఉండేది. కానీ, డిమాండ్ మేరకు టాక్స్ కలెక్షన్ కాకపోవడంతో ఉద్యోగుల జీతాలకూ ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు వాపోతున్నారు.
ట్యాక్స్లు చెల్లిస్తేనే డెవలప్మెంట్
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన బకాయిలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ట్యాక్స్ వసూలు కోసం వెళ్లిన సిబ్బందిపై కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాదేశాల మేరకే మేము చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్గా ట్యాక్స్లు చెల్లిస్తేనే మున్సిపాలిటీలో డెవలప్మెంట్ వర్క్స్ చేయగలం. బకాయిదారులు అర్థం చేసుకొని మాకు సహకరించాలి. ప్రభుత్వం ప్రకటించిన 90 శాతం వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - టి.శివాజీ, మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్
ఇవీ ఇబ్బందులు
మంచిర్యాల వంద ఫీట్ల రోడ్లోని ఓ బిల్డింగ్ యజమాని ఐదు సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం లేదు. రూ.35వేల బకాయిలు రాబట్టడం కోసం మున్సిపల్ అధికారులు అతనికి రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. ఐదు రోజుల కిందట వెళ్లిన అధికారులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు దిగాడు.
దీంతో అధికారులు ఇంటి గేట్కు తాళం వేశారు. దిగొచ్చిన బిల్డింగ్ యజమాని వెంటనే బకాయిలు చెల్లించాడు. చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులకు పదేండ్లుగా ట్యాక్స్ చెల్లించడం లేదు. బకాయిలు సుమారుగా రూ.3.50 లక్షలు పేరుకుపోయాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది ఈ రెండు ఆఫీసులకు తాళం వేశారు. వెంటనే స్పందించి త్వరలోనే బకాయిలు క్లియర్ చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో తాళం తీశారు.
ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి కోట్ల రూపాయలలో పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసినా, ఆస్తులు జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చినా కూడా బకాయిదారులు లైట్ తీసుకుంటున్నారు. కొంతమంది బడా వ్యాపారులు, చోటామోటా లీడర్లు మున్సిపల్ అధికారులనే బెదిరిస్తున్నారని వాపోతున్నారు.