రూ.5.68 కోట్ల గన్నీబ్యాగులు గాయబ్​ .. పట్టించుకోని అధికారులు​

రూ.5.68 కోట్ల గన్నీబ్యాగులు గాయబ్​ .. పట్టించుకోని అధికారులు​
  • సివిల్​సప్లై గోడౌన్​లలో గోల్​మాల్

మెదక్​, వెలుగు : జిల్లాలోని సివిల్​సప్లై గోడౌన్​లలో తవ్విన కొద్దీ అక్రమలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల కింద మెదక్, రామాయంపేట, చేగుంట, తూప్రాన్​ ఎంఎల్​ఎస్​ పాయింట్లలో  సుమారు రూ.16 కోట్ల విలువైన కస్టం మిల్లింగ్ రైస్​(సీఎంఆర్​), సన్నబియ్యం మాయమయ్యాయి. ఇపుడు అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.5.68 కోట్ల విలువైన గన్నీ బ్యాగులు గాయబ్​ అయినట్టు గుర్తించారు.

వానాకాలం, యాసంగి సీజన్​లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ, మార్క్​ఫెడ్​ఆధ్వర్యంలో ఏర్పాటు  చేసే ప్యాడీ ప్రొక్యూర్​ మెంట్​సెంటర్​ (పీపీఎస్​)లకు, బియ్యం నిల్వచేసేందుకు రైస్​మిల్లర్లకు సివిల్​సప్లై డిపార్ట్​మెంట్​గన్నీబ్యాగులు కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా సీజన్​లలో 300 నుంచి 400 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.  

రైస్​ మిల్లులు160 ఉన్నాయి. జిల్లాకు అవసరమైన గన్నీ బ్యాగులు  కొనుగోలు చేసి మెదక్​, రామాయంపేట, చేగుంటలోని గోడౌన్​లలో స్టాక్​చేసి అవసరాలను బట్టి ఆయా కొనుగోలు కేంద్రాలకు, రైస్​ మిల్లులకు సప్లై చేస్తారు. ఈ గోడౌన్​లకు వచ్చే గన్నీ బ్యాగ్​లను 50 చొప్పున కట్టలు కట్టి ఒక క్రమ పద్దతిలో అమర్చాలి. వాటికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్​మెయింటెన్​ చేయాలి. ఏ కొనుగోలు కేంద్రానికి, ఏ రైస్​ మిల్లుకు ఎన్ని బ్యాగులు ఇచ్చింది, ఇంకా ఎన్ని బ్యాగులు నిల్వ ఉన్నాయనేది ఎప్పటికపుడు రికార్డులో నమోదు చేయాలి.

సివిల్​సప్లై డిపార్ట్​మెంట్, రెవెన్యూ అధికారులు గోడౌన్​లను తనిఖీ చేసి బియ్యంతోపాటు, గన్నీబ్యాగుల రికార్డులను  తనిఖీ చేసి సక్రమంగా ఉన్నాయా? లేదా ? అన్నది పరిశీలించాలి. అయితే అధికారులు ఇవేమి పట్టించుకోకపోవడంతో గోడౌన్​ ఇన్‌చార్జిలది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అడిగేవారు లేరనే ధీమాతో లక్షల గన్నీ బ్యాగులను పక్కదారి పట్టించారు. 

అక్రమాలు ఇలా..

గడచిన ఏడాదిన్నర కాలంలోనే జిల్లాలో రూ.5.68 కోట్ల విలువైన 14.15 లక్షల గన్నీబ్యాగులు పక్కదారి పట్టాయి. మెదక్​ పట్టణంలోని గోడౌన్​లో రూ.2.08 లక్షల విలువైన పాత గన్నీబ్యాగులు 8.05 లక్షలు, రూ.2.49 కోట్ల విలువైన 3.28 లక్షల కొత్త గన్నీ బ్యాగులు మాయమయ్యాయి. రామాయంపేట గోడౌన్​లో రూ.52.52 లక్షల విలువైన పాత గన్నీ బ్యాగులు 2 లక్షలు, రూ.66.68 లక్షల విలువైన 87,830 కొత్త గన్నీ బ్యాగులు మాయమయ్యాయి. చేగుంటలోని గొడౌన్​లో కూడా గన్నీ బ్యాగులు మాయమైనట్టు తెలియడంతో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. 

ఆర్​ఆర్​యాక్ట్​ కింద రికవరీ

మెదక్, రామాయంపేట గోడౌన్​లలో పెద్ద మొత్తంలో గన్నీబ్యాగులు పక్కదారి పట్టినట్టు తనిఖీల్లో గుర్తించాం. గోడౌన్​ ఇన్‌చార్జిలు గన్నీబ్యాగుల స్టాక్,​ రిజిస్టర్ల మెయింటనెన్స్​ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మెదక్, రామాయంపేట గోడౌన్​లలో పీడీఎస్​రైస్​అక్రమాలకు పాల్పడిన ఆయా గోడౌన్​ ఇన్‌చార్జిలు నర్సింలు, సతీశ్ మీద క్రిమినల్​ కేసులు నమోదయ్యాయి. వారి మీద ఆర్​ఆర్​యాక్ట్​ ప్రయోగించి పక్కదారి పట్టిన బియ్యం తాలూకూ మొత్తాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే దుర్వినియోగం అయిన గన్నీబ్యాగులకు సంబంధించిన అమౌంట్​ కూడా ఆర్​ఆర్​యాక్ట్​ కింద వారి నుంచి రికవరీ చేస్తాం. 

హరికృష్ణ, సివిల్​సప్లై డీఎం