ఒక్కరోజులో ఓరుగల్లు చుట్టేద్దాం .. టూరిజం శాఖ సరికొత్త ప్యాకేజీ

ఒక్కరోజులో ఓరుగల్లు చుట్టేద్దాం .. టూరిజం శాఖ సరికొత్త ప్యాకేజీ
  • హనుమకొండ హరిత హోటల్‍ నుంచి బస్సు సౌకర్యం
  • వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, ఫోర్ట్ వరంగల్‍  ప్రాంతాల్లో పర్యటన
  • ఉదయం 8 గంటలకు ప్రారంభం.. సాయంత్రం 7.45 గంటలకు క్లోజ్‍ 

వరంగల్‍, వెలుగు : వరంగల్ టూరిజంలో మరో అడుగు పడింది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెరుగుతుండగా మరింతగా చేరువ చేసేలా టూరిజం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీటిని ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో ఒక్క రోజులో చూసిరావడం ఇబ్బందిగా మారింది.  రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం పేరుతో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. 

ఈనెల 20 నుంచి సేవలు ప్రారంభమవుతాయని టూరిజం శాఖ తెలిపింది. ఇందులో ఐదు ప్రధాన ఆలయాలు, పర్యాటక కేంద్రాలను చేర్చగా.. ఇందులో వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, కాకతీయుల రాజధాని కేంద్రంగా చెప్పుకునే ఖిలా వరంగల్‍ కోట ఉన్నాయి. 26 సీట్ల కెపాసిటీ బస్సు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‍ నుంచి బయలుదేరుతుంది. మళ్లీ సాయంత్రం 7.45 గంటలకు  హోటల్‍ వద్దకు పర్యాటకులను చేర్చుతుంది.

చార్జీలు ఇలా.. 

పెద్దలు : రూ.980
పిల్లలు :  రూ.790
టికెట్ బుకింగ్‍ నంబర్లు:  9010007261/9000000126
వెబ్ సైట్ : www.tgtdc.in