రైతుల ఆందోళనకు దిగొచ్చిన అధికారులు..దేవాదుల 8 ఆర్‌‌ కెనాల్ పరిశీలన

రైతుల ఆందోళనకు దిగొచ్చిన అధికారులు..దేవాదుల 8 ఆర్‌‌ కెనాల్ పరిశీలన

చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని దేవాదుల 8 ఆర్‌‌ కాలువ కొత్త డిజైన్‌ను నిరసిస్తూ రైతులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తుండడంతో అధికారులు స్పందించారు.  శుక్రవారం దేవాదుల డీఈ రుద్ర, జేఈ స్మిత కెనాల్​ ఓటీ, ముస్త్యాల శివారులో గతంలో తవ్విన కాలువను పరిశీలించారు. కాలువపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు  గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.  సిద్దిపేట జిల్లాలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఒక అధికారి సిఫార్సు మేరకు గతంలో డిజైన్ ​మార్చినట్లుగా ఫోన్‌లో మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది.

 కొందరు రియల్టర్ల ఒత్తిడి మేరకే డిజైన్ ​మార్చారని స్థానిక రైతులు అధికారులకు  తెలిపారు. పాత డిజైన్​ ప్రకారం కాలువ నిర్మాణం చేపడితే  ఒక్క రైతుకు కూడా ఇబ్బంది ఉండదని, కొత్త డిజైన్​ వల్ల  భూములు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు.  త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామని డీఈ రుద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు కొంతం మల్లేశం, శ్రీను, బత్తెపు లింగం, బీర్ల నర్సయ్య, రవి, మహేశ్, దాసరి అనిల్​, పిల్లి వెంకటేశం పాల్గొన్నారు.