బీసీ బిల్లుకు క్యాబినెట్ ఓకే.. మార్చి12 నుంచి అసెంబ్లీ.. ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు

బీసీ బిల్లుకు క్యాబినెట్ ఓకే.. మార్చి12 నుంచి అసెంబ్లీ.. ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు
  • స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% కోటాకు కేబినెట్​ ఆమోదం
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేర్వేరుగా రెండు బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం
  • ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్​సిగ్నల్
  • నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్​ సిటీ
  • 7 మండలాలు, 56 గ్రామాలతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్ అథారిటీ
  • కొత్తగా 10,954 విలేజ్ లెవల్ ఆఫీసర్స్ పోస్టులు.. వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారికి చాన్స్​
  • ఇందిరా మహిళా శక్తి మిషన్, టూరిజం పాలసీలకు ఆమోదం
  • ఒకే గొడుగు కిందికి సెర్ప్, మెప్మా.. ట్రిపుల్​ ఆర్​ వరకుహెచ్​ఎండీఏ పరిధి
  • రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ఇన్​స్టిట్యూట్ సొసైటీ పరిధిలో495 పోస్టులు
  • డీలిమిటేషన్​పై త్వరలో అఖిలపక్ష భేటీ
  • టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు
  • రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
  • సీఎం అధ్యక్షతన దాదాపు ఏడు గంటలపాటు సమావేశం

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే రెండు బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటికి సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్​ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. 

7 మండలాలు, 56 గ్రామాలతో దాదాపు 30 వేల ఎకరాల్లో  ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్​సీడీఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు గాను 10,954  గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామ కానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమించాలని నిర్ణయించింది. 

గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారికి ఇందులో  అవకాశం ఇవ్వనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి  కేబినెట్ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు ఓకే చెప్పింది.  అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్​స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987 కు సవరణలు చేయాలని నిర్ణయించారు. 

ఇది కూడా రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే సవరించనున్నారు. దీంతో పాటు టూరిజం పాలసీ 2025-30కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సెక్రటేరియెట్​లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్​ సమావేశమైంది. దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం రాత్రి మీడియాకు వెల్లడించారు. 

డీలిమిటేషన్​పై అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్​పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్​లో నిర్ణయించారు. పార్లమెంట్​ నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్ర ప్రభుత్వం దురాలోచన చేస్తున్నదని.. దక్షిణ, ఉత్తర భారతదేశంలో ఒక్కోలా సీట్లు పెరిగేలా వ్యవహరిస్తున్నదని మంత్రులు పొంగులేటి, పొన్నం మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, సీట్ల పెంపు దేశవ్యాప్తంగా ఒకేలా జరిగిలే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్​లో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కొట్లాడుతామని స్పష్టం చేశారు. 

హెచ్​ఎండీఏ 11 జిల్లాల్లోకి!

హెచ్​ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు కేబినెట్  ఆమోదం తెలిపింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్​ఎండీఏ పరిధి పెరుగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్​ఎండీఏ పరిధిలోకి రానున్నాయని మంత్రులు తెలిపారు.  ఓఆర్​ఆర్​కు ఇన్నర్​ సైడ్​ ఉన్నదంతా కోర్​ తెలంగాణగా, ఓఆర్​ఆర్​ నుంచి ​ఆర్​ఆర్ ఆర్​ వరకు అదనంగా 2 కి.మీ బఫర్​ ఏరియా మొత్తం  అర్బన్​ గా..  మిగిలిన  ప్రాంతాలు (మున్సిపాలిటీలు కాకుండా) రూరల్​ తెలంగాణగా ఉంటుందని పేర్కొన్నారు. 

నాగార్జునసాగర్ హైవే నుంచి  శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్​ సిటీ

ఫ్యూచర్ సిటీ డెవెలప్‌‌మెంట్ అథారిటీ (ఎఫ్​సీడీఏ)ని ఏర్పాటు చేస్తూ కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నారు.  7 మండలాలు, 56 గ్రామాలతో ఈ అథారిటీ ఉంటుంది. నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఫ్యూచర్ సిటీ డెవలప్​మెంట్ అథారిటీకి రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఎస్సీ, బీసీ డ్రాఫ్ట్​ బిల్లులకు ఆమోదం

ఎస్సీ కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  కమిషన్ మార్చి 2న తమ రెండో నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఫిబ్రవరి 3న కమిషన్ ఇచ్చిన మొదటి నివేదికలో చేసిన సిఫారసులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ధ్రువీకరించిందన్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన  71 విజ్ఞప్తులను రెండో విడతలో కమిషన్ పరిశీలించిందని పేర్కొన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కేబినెట్ లో చర్చించామన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులను  సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

 బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రెండు డ్రాఫ్ట్​ బిల్లులకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు  42 శాతం  రిజర్వేషన్లను కల్పించేలా ముసాయిదా బిల్లుకు.. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే మరో ముసాయిదా బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ చెప్పారు. వేర్వేరుగా ఈ రెండు  బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తీర్మానం చేసినట్లు వివరించారు.  2017 లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

మహిళలకు కొత్త పాలసీ

ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి  కేబినెట్ఆమోదం తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి  తగ్గట్టు కొత్త పాలసీని రూపొందించింది.  స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా శక్తి సంఘాలను ఒకే గొడుగు కిందికి తీసుకు రానున్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65  ఏండ్లకు పెంచి.. గ్రూప్ ల్లో చేరే కనీస వయసును 18 నుంచి 15 ఏండ్లకు తగ్గించారు. ఈ మేరకు కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నారు. 

ఘనంగా మిస్​ వరల్డ్​ పోటీల నిర్వహణ

తెలంగాణ టూరిజం పాలసీ 2025-–2030కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 27 స్పెషల్ టూరిజం ఏరియాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాబోయే ఐదేండ్లలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్లు మంత్రులు వెల్లడించారు. --మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 140 దేశాలు పాలుపంచుకునే ఈ వేడుకలను తెలంగాణకు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని కేబినెట్​ నిర్ణయాలు

  •     
  • శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ (ఈఎస్​ఐ) ఆసుపత్రి నిర్మాణానికి కేటాయింపు.
  •     
  • పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం. 
  •     
  • కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో  361 పోస్టులు. 
  •     
  • తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్, 165 ఔట్ సోర్సింగ్ .. మొత్తం 495 పోస్టులు.
  •     
  • గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీ  4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గింపు.