
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. బుధవారం నుంచి భారతీయ రోడ్లపై ఈ బండ్లు రయ్ రయ్మంటూ తిరగనున్నాయి. ఇప్పటికే రూ.499 చెల్లించి చాలా మంది ఓలా స్కూటర్లను బుక్ చేసుకున్నారు. అలాంటి వారిలో మొత్తం పేమెంట్ చెల్లించి, బండిని కొనుగోలు చేయడం ఎలా అనే సందేహాలు ఉన్నాయి. ఈ విషయంపై ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించారు. ఓలా ఎస్1 కొనుగోళ్ల ప్రక్రియ మొదలైందని, రిజర్వేషన్ను షురూ చేశామన్నారు. బుక్ చేసుకున్న వారు తమ ఈమెయిల్ లేదా ఓలా యాప్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ను చెక్ చేసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఓలా కొత్తగా ఎస్1, ఎస్2 ప్రొ పేరుతో రెండు వేరియంట్లలో స్కూటర్లను తీసుకొచ్చింది. వీటి ధర రూ.99 వేలు, రూ.1.29 లక్షలుగా ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకోండిలా..
- ఇప్పటికే ప్రీ బుకింగ్ ధర చెల్లించినట్లయితే ఫోన్ నంబరు సాయంతో ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత నచ్చిన రంగు, వేరియంట్ను ఎంచుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోనట్లయితే రూ.499 చెల్లించి ప్రీ బుక్ చేసుకోవాలి.
- స్కూటర్ రంగు, వేరియంట్ను సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ ట్యాబ్కు వెళ్లాలి. ఎంపిక చేసుకున్న వేరియంట్ను బట్టి పూర్తి ధరను చెల్లించాలి. స్కూటర్ను ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే నెలవారీ ఈఎంఐలు ఆప్షన్ను ఎంచుకోవాలి. ఈ ఈఎంఐలు ఎస్1 స్కూటర్లకు నెలకు రూ.2,999 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్1 ప్రొకు రూ.3,199 చెల్లించాలి.
- ఫైనాన్సింగ్ విషయంలో ఐడీఎఫ్సీ బ్యాంక్, హెడ్డీఎఫ్సీ, టాటా క్యాపిటల్ లాంటి సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ ఒప్పందం చేసుకుంది. ఫైనాన్సింగ్ కావాలనుకున్న వాళ్లు వీటిలో ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ పొందొచ్చు. ఒకవేళ ఫైనాన్సింగ్ వద్దనుకుంటే రూ.20 వేలు అడ్వాన్స్ చెల్లించి బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. మిగిలిన మొత్తాన్ని స్కూటర్ షిప్మెంట్ అనంతరం చెల్లించొచ్చు.
- బుకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డెలివరీ డేట్ ఎప్పుడనే వివరాలు తెలుస్తాయి. అక్టోబర్ నెల నుంచి వెహికల్ డెలివరీలు మొదలవుతాయి. నేరుగా బుక్ చేసిన వారి ఇళ్లకే స్కూటర్లు డెలివరీ అవుతాయి. డెలివరీకి 72 గంటల ముందు దానికి సంబంధించిన సమాచారాన్ని బుకింగ్ చేసుకున్న వారికి పంపుతారు.