జాతకం బాలేదు.. శాంతి పూజలు చేయాలని.. 26 తులాల బంగారంతో ఎస్కేప్ అయ్యాడు.. ఎలా దొరికాడంటే..?

జాతకం బాలేదు.. శాంతి పూజలు చేయాలని.. 26 తులాల బంగారంతో ఎస్కేప్ అయ్యాడు.. ఎలా దొరికాడంటే..?

బురిడీ బాబాల వలలో పడి మోసపోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అదీ చదువుకున్న వాళ్లు.. ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. బాబాల మాట నమ్మి జాతకాలు, శాంతి పూజల పేరిట మోసపోతున్నారు. కుటుంబ పరిస్థితులు, తాత్కాలిక సమస్యల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని శాంతి పూజలు చేస్తే మంచి జరుగుతుందని అమాయకులను బురిగీ కొట్టిస్తు్న్నారు ఫేక్ బాబాలు. అందినంత వరకు డబ్బులు, సొమ్ములు తీసుకుని ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

కాచిగూడ అడిషనల్ డీసీపీ నరసయ్య తో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించిన వివరాల ప్రకారం.. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న గీత ఇటీవల భర్తను కోల్పోయింది. భర్త లెక్చరర్ గా పని చేసిన దిల్సుఖ్ నగర్ లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తోంది. ఆమె కూతురు ఎంబీబీఎస్ చదువుతోంది.  గత ఏడాది భర్త మరణించడంతో ఒకదాని వెంట ఇంకో సమస్యలు  తలెత్తాయి. దీంతో ఆమె పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ సూచన మేరకు గుంటూరు కు చెందిన అరిగెల శాంభశివుడు అలియాస్ గురూజీ శివస్వామిని దిల్సుఖ్ నగర్  లో కలిసి తమ పరిస్థితిని వివరించింది. 

బాధిత మహిళ కూతురి జాతకం బాగాలేదని.. ఆమె పెళ్లి అయ్యాక ఆత్మహత్య లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందని బురిడీ బాబా బెదిరించాడు. శాంతి పూజలు చేస్తే దోషం పరిహారం అవుతుందన్నాడు.  భయపడిన బాధిత మహిళ శాంతి పూజలు చేయించేందుకు అంగీకరించి బురిడీ బాబాకు మొదట రూ.1 లక్ష 70 వేలు ముట్టజెప్పింది. ఇంకా పూజలు చేయాలనీ, లేదంటే అనర్థం జరుగుతుందని బెదిరిస్తూ ఆమె వద్ద నుండి 26 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటి డాక్యుమెంట్ లను తీసుకుని, పూజ పేరిట శ్రీకాళహస్తి కు తీసుకెళ్లి అక్కడ పూజ నిర్వహించాడు. 

►ALSO READ | హైదరాబాద్లో చీరల దొంగలు.. కృష్ణా జిల్లా నుంచి 60 మంది ముఠా.. వీళ్ల నెట్వర్క్ చూసి పోలీసులే షాక్

ఈ సమయంలో బాధిత మహిళ గీతతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఆమె కూతురు తిరిగి హైదరాబాద్ వచ్చాక వారి ఇంటి డాక్యుమెంట్ లను వెనక్కు తీసుకుని, వారు ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. దీంతో  బురిడీ బాబా హైదరాబాద్ నుండి పరారయ్యాడు. బాధిత మహిళ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కాచిగూడ ఇన్స్పెక్టర్ ఝాన్సీ, డిఐ సురేష్ , ఎసై నరేష్ లు కేసు నమోదు చేసి , బురిడీ బాబాపై నిఘా పెట్టారు. ఈ నెల 12న తిరుపతి నుండి హైదరాబాద్ కు వచ్చిన బురిడీ బాబా శాంభశివుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో ప్రేవేట్ ల్యాండ్ సర్వేయర్ గా పని చేసిన శాంభశివుడు అక్కడ వచ్చే డబ్బులు సరిపోక , ఈ బాబా అవతారం ఎత్తినట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుండి 20.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు తులాల బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టాడని.. మిగిలి బంగారం అమ్ముకున్నట్లు డీసీపీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి , రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. ప్రజలు ఇలాంటి బురిడీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.