గుడ్ న్యూస్: మహిళా దినోత్సవం సందర్భంగా.. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ.. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం

గుడ్ న్యూస్: మహిళా దినోత్సవం సందర్భంగా.. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ.. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం
  • ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటన
  • డీఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ పై రూ. 3.6 కోట్లు అదనపు భారం
  • మహిళా దినోత్సవం నుండి అమలులోకి
  • మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
  • ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి నినాదంతో ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం
  • మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా  మొదటి దశలో 150 బస్సులు 
  • తరువాత దశలో 450 బస్సులు.. మొత్తం 600 బస్సులు 
  • మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం
  • రేపు (మార్చి8) లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం.. శనివారం (మార్చి 8) ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ అమలు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. మహిళా దినోత్సవం రోజు మహిళా శక్తి బస్సుల ప్రారంభంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు అమలు చేయనున్నట్లు  రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం, ఉద్యోగులకు 2.5 శాతం డీఏ వల్ల ఆర్టీసీ పై ప్రతి నెల రూ.3.6 కోట్ల భారం పడనుందని తెలిపారు. 

మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేసినట్లు  వెల్లడించారు. మహా లక్ష్మి పథకం ప్రారంభం తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగినా, నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం అభినందించారు. 

మహిళా దినోత్సవం సందర్భంగా డీఏ శనివారం (మార్చి 8) అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని, మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందని అన్నారు. మహిళా సమాఖ్య సంఘాల చేతే బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి మహిళలు ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో పాటు అధికారులతో పలుమార్లు చర్చించారు పొన్నం.  

Also Read :- క్రిప్టో కరెన్సీ దశ-దిశ మార్చే నిర్ణయం

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టీ బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. 

శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి  ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగింది. శనివారం మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

 ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మహిళా  సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు శనివారం ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలైన వరంగల్ ,ఖమ్మం ,కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా  ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి.