
- నిరుడు మార్చి 10న అర్భాటంగా భూమిపూజ
- రూ.20 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రపోజల్స్
- నేటికీ రాని శాంక్షన్ ఆర్డర్
- రానున్న వర్షాకాలంలోనూ రాళ్లపేట వాసులకు కష్టాలే
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం లోని రాళ్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఇప్పుడున్న లో లెవల్ కాజ్వే స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిరుడు మార్చి 10న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆనాడు ప్రకటించారు. నేటికి ఏడాది కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో దీనికి ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.13.50 కోట్లు కేటాయించగా, మొత్తం రూ.20 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపామని, ఇంకా శాంక్షన్ ఆర్డర్ రాలేదని ఆర్అండ్బీ ఆఫీసర్లు పేర్కొన్నారు.
20 ఏండ్ల క్రితం లో లెవల్ కాజ్వే..
రాళ్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని వాగు అవతలి వైపు ఉన్న రంగంపేట, పవర్ హౌస్ కాలనీ, ఆండాలమ్మ కాలనీ ప్రజలు దశాబ్దాల కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజల గోడును గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు. బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత వాగు చుట్టుపక్కల కాలనీలు విస్తరించాయి. దీంతో 2005లో రాళ్లవాగుపై సుమారు రూ.80 లక్షలతో లో లెవల్ కాజ్వే నిర్మించారు. అప్పటినుంచి రంగంపేట, పవర్ హౌస్ కాలనీ, ఆండాలమ్మ కాలనీ ప్రజలు కాజ్వే మీదుగా మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతకుముందు ఆండాళమ్మ కాలనీ, ఏసీసీ మీదుగా ఐదారు కిలోమీటర్లు ప్రయాణించేవారు. కాజ్వే నిర్మాణంతో కేవలం అర కిలోమీటరు దూరంలోనే మంచిర్యాలకు చేరుకుంటున్నారు. ఈ కాలనీల ప్రజలు నిత్యం పాలు, కూరగాయలు అమ్ముకోవడానికి, ఇతర అవసరాలకు టౌనుకు వస్తుంటారు. స్టూడెంట్లు, ఉద్యోగులు బైక్లు, ఆటోలు, ఇతర వెహికల్స్ ద్వారా కాజ్వే మీదుగా సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.
కాజ్వే కూలడంతో ఇబ్బందులు
2019లో కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగుపై నిర్మించిన కాజ్వే కూలిపోయింది. దీంతో కాజ్వే మీదుగా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ అధికారులు టెంపరరీగా మట్టిపోసి చేతులు దులుపుకొన్నారు. గత ఐదేండ్లుగా ఏటా వర్షాకాలంలో వరదలకు మట్టి కొట్టుకుపోవడం, అధికారులు తాత్కాలిక రిపేర్లు చేసి వదిలేయడం తంతుగా మారింది. రాళ్లవాగుకు వరదలు వచ్చినప్పుడు కాజ్వే పూర్తిగా నీట మునిగి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. దీంతో మళ్లీ ఆండాలమ్మ కాలనీ రోడ్డే ప్రజలకు దిక్కయ్యింది. ఇటీవల రంగంపేటలో కొత్త కాలనీలు విస్తరించాయి. దీంతో రాళ్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి త్వరగా నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ ఇన్చార్జి ఈఈ భవ్ సింగ్ను సంప్రదించగా.. ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపామని, వారం పది రోజుల్లో శాంక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశముందని చెప్పారు.