కొడుకు చేసిన పనికి కుటుంబం బలి : ఆన్​లైన్​ బెట్టింగ్స్​ఆగం చేసింది

కొడుకు చేసిన పనికి కుటుంబం బలి : ఆన్​లైన్​ బెట్టింగ్స్​ఆగం చేసింది

ఎడపల్లి, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగ్స్​ ఓ పచ్చని కుటుంబాన్ని బలితీసుకున్నాయి. బెట్టింగ్స్​కు బానిసై కొడుకు రూ. 18 లక్షల అప్పులు చేయడంతో.. అవి తీర్చేదారి లేక, తీవ్ర మనస్తాపంతో కొడుకుతో కలిసి దంపతులు ఉరివేసుకొని ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రంగణవేణి సురేశ్​(50), హేమలత (45) దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరి ఒక్కగానొక్క కొడుకు హరీశ్​(25 ). ఇంటర్​ వరకు చదివి ఎడ్యుకేషన్​ను ఆపేశాడు. 

జీవనోపాధి కోసం హరీశ్​కు తల్లిదండ్రులు కిరాణషాపు పెట్టించారు. కిరాణషాపు నడుపుతూ.. ఆన్ లైన్​  బెట్టింగ్స్​కు హరీశ్​ అలవాటుపడ్డాడు. ఇందుకోసం తెలిసినవాళ్ల దగ్గర లక్ష, రెండు లక్షల చొప్పున మొత్తంగా రూ. 18 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చాలంటే జీవితాంతం కష్టపడ్డా తీర్చలేమన్న మనోవేదనతో శనివారం తెల్లవారే సరికి సురేశ్​, హేమలత, వాళ్ల కొడుకు హరీశ్​ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయారు. ఉదయమే 8 గంటలైనా ఆ ఇంటి తలుపులు తీయకపోవడంతో పక్కింటివాళ్లు కిటికీ నుంచి చూడగా.. ముగ్గురూ ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.