
- బోర్డు చెప్పినా యథేచ్ఛగా నీటిని తోడేస్తున్న ఏపీ
- బోర్డు మీటింగ్ జరిగినప్పటి నుంచి 12 టీఎంసీలు డ్రా
- సాగర్ కుడి కాల్వ నుంచి 8 వేల క్యూసెక్కులకుపైగా తరలింపు
- శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వరకు తీసుకెళ్లిన ఏపీ
- ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న కోటా మరో 8 టీఎంసీలే
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తోడేస్తున్నది. కృష్ణా బోర్డు ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ నాగార్జున సాగర్ కుడి కాల్వ, శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతున్నది. నిర్దేశించిన కోటాకు మించి జలదోపిడీ చేస్తుండడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం వాడుకోవడానికి ఉన్న నీళ్లు కేవలం 45.2 టీఎంసీలే. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27న రెండు ప్రాజెక్టుల్లో వాడుకోవడానికి వీలుగా 65.2 టీఎంసీల నీళ్లుండగా.. ఈ 10 రోజుల్లోనే రెండు ప్రాజెక్టుల నుంచి 20 టీఎంసీల నీళ్లు ఖాళీ అయిపోయాయి. శ్రీశైలం నుంచి ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసినా.. సాగర్ కుడి కాల్వ నుంచి 7 వేల క్యూసెక్కులకు మించి తీసుకోరాదని ఆదేశాలున్నా.. ఏపీ మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. తన దోపిడీకి అడ్డు ఎవరన్న చందంగా ఇటు శ్రీశైలంలోని హంద్రినీవా నుంచి.. అటు నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి వేలకు వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్నది.
2 సార్లు బోర్డు మీటింగ్లో చెప్పినా..
ఏపీ జలదోపిడీని నియంత్రించేందుకు ఫిబ్రవరిలో 2 సార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని నిర్వహించింది. 24న ఒకసారి.. 27న మరోసారి 2 రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. 27న జరిగిన భేటీ నాటికి ఏపీకి 23 టీఎంసీల నీళ్ల కోటానే మిగిలి ఉంది. అయితే, ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని ఏపీకి 20 టీఎంసీలు ఇచ్చేందుకు బోర్డు అంగీకరించింది. సాగర్ కుడి కాల్వ నుంచి అప్పటికే 10 వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్న ఏపీకి.. కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్లేలా ఆదేశించింది. మీటింగ్ జరిగిన రోజు నుంచి 3 రోజుల పాటు 7 వేల క్యూసెక్కులకుపైగా నీటిని కుడి కాల్వ ద్వారా తీసుకెళ్లింది. ఆ తర్వాత రెండు రోజులు 6వేల క్యూసెక్కులకు తగ్గించుకున్నా.. ఆ తర్వాతి నుంచి5 రోజులుగా 8 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుంటున్నది. మీటింగ్ జరిగనప్పటి నుంచి ఇప్పటిదాకా సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ దాదాపు 6 టీఎంసీల నీటిని తీసుకెళ్లినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోవడానికి లేకున్నా.. హంద్రీనీవా వంటి కెనాల్స్ ద్వారా 3 వేల క్యూసెక్కులకుపైగా జలాలను తోడుతున్నది. అక్కడి నుంచి కూడా ఏపీ ఇప్పటి వరకు ఆరేడు టీఎంసీల వరకు తోడుకున్నది. మొత్తంగా ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న వాటాలో 12 టీఎంసీలకుపైగా నీటిని వాడేసుకున్నది. అదే సమయంలో తెలంగాణ తన వాటా మేరకు ఈ పది రోజులుగా 8,500 క్యూసెక్కుల నుంచి 9 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే నీటిని సాగర్ ఎడమ కాల్వ ద్వారా తీసుకుంటున్నది.
వేగంగా పడిపోతున్నయ్..
రెండు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27న సాగర్ ప్రాజెక్టులో 170 టీఎంసీల నీళ్లుండగా.. అందులో వాడుకోవడానికి వీలుగా 29.6 టీఎంసీలు ఉన్నట్టు బోర్డు నిర్ధారించింది. ప్రస్తుతం 158 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అందులో లైవ్ స్టోరేజ్లో ఉన్న జలాలు 17.6 టీఎంసీలే. మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ను 515 అడుగులుగా నిర్ధారించగా.. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 524.8 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మీటింగ్ నాటికి మొత్తం నిల్వ 79 టీఎంసీలు ఉండగా.. లైవ్ స్టోరేజ్లో 35.6 టీఎంసీలు ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం మొత్తం స్టోరేజ్ 71.9 టీఎంసీలుండగా.. లైవ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లు 27.6 టీఎంసీలే. బోర్డు మీటింగ్లో శ్రీశైలం మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ను 820గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 846 అడుగులుగా ఉన్నది. ఈ పది రోజుల్లోనే సాగర్లో 12 టీఎంసీలు, శ్రీశైలంలో 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయిపోయాయి.
గోదావరి బేసిన్లోనూ తగ్గుతున్నయ్..
కృష్ణా బేసిన్తో పాటు ఇటు గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గోదావరి బేసిన్లో ప్రధాన ప్రాజెక్టైన శ్రీరాంసాగర్లో పూర్తి స్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 29.27 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. మిడ్మానేరులో 27.5 టీఎంసీలకుగానూ 14.28 టీఎంసీలు, లోయర్ మానేరులో 24 టీఎంసీలకుగానూ 11.09 టీఎంసీలు, నిజాంసాగర్లో 17.8 టీఎంసీలకుగానూ 8.35 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకుగానూ 12.50 టీఎంసీల జలాలే అందుబాటులో ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ.. 22.34 టీఎంసీలు ఉన్నాయి.