
- ఆ అధికారి వద్దు !
- ఆఫీసర్లపై సీఈఓకు, ఈసీకి పెరుగుతున్న కంప్లైంట్స్
- జనగామ కలెక్టర్ పై ప్రతిపక్ష నాయకుల ఫిర్యాదు
- ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని వెల్లడి
- మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఈసీకి మెయిల్
హైదరాబాద్, వెలుగు : కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ఆఫీసర్లపై కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. బుధవారం 20 మంది అధికారులపై ఈసీ బదిలీ వేటు వేయడంతో.. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఫలాన ఆఫీసర్ తమకొద్దంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్కొంటున్నారు. సీఈఓను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఈసీకి కూడా డైరెక్ట్ మెయిల్స్ పంపుతున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు, ఎస్పీలు, కిందిస్థాయి ఆఫీసర్లపై 10కి పైగా కంప్లయింట్స్ వచ్చినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.
జనగామ కలెక్టర్ శివలింగయ్యపై ప్రతిపక్ష నాయకులు గురువారం సీఈఓకు కంప్లైంట్ చేశారు. అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సాఆర్టీపీతో పాటు ఇతర నాయకులు ఫిర్యాదుచేశారు. మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఆన్లైన్లో కంప్లైంట్స్ అందాయి. డీజీపీ అంజనీ కుమార్పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది.
ఆఫీసర్లలో మొదలైన భయం
ఈసీ సడెన్గా ఇరవై మంది అధికారులను బదిలీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలక్షన్ కమిషన్ హెచ్చరిక లు జారీ చేసినా.. ఈ స్థాయిలో ట్రాన్స్ఫర్ల వేటు ఉం టుందని ఎవరూ ఊహించలేదు. దీంతో మిగిలిన ఆఫీసర్లందరిలో వణుకు మొదలైంది. ఎలక్షన్ డ్యూటీ.. పార్టీలకు, లీడర్లకు అతీతంగా, ఎవరికీ అనుకూలం, వ్యతిరేకంగా ఉండదు అనే విధంగా వ్యవహారశైలి మార్చేసుకున్నారు.
డిసెంబర్ 3 దాకా తమను సక్రమంగా ఎలక్షన్ డ్యూటీ చేసుకొనిస్తే తమకు అదే పదివేలు అని ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వేటు తప్పదని ఈసీ హెచ్చరించిన నేపథ్యంలో ఇదే విషయాన్ని తమకు పోస్టింగ్ వచ్చేలా సహకరించిన ప్రజాప్రతినిధులకు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. రూలింగ్ పార్టీ లీడర్లు అధికారుల దగ్గరకు వెళ్లి ఏదైనా చెప్పినా ఉపయోగం ఉండటం లేదని అంటున్నారు.