డీఎస్సీని వాయిదా వేయండి.. ఓయూ జేఏసీ డిమాండ్

డీఎస్సీని వాయిదా వేయండి.. ఓయూ జేఏసీ డిమాండ్
  • పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి 

బషీర్ బాగ్, వెలుగు:  డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ  డీఎస్సీ అభ్యర్థులతో కలిసి ఓయూ జేఏసీ నేతలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్ లక్డీకపుల్ లోని కార్యాలయం గేటు ముందు బైఠాయించి డీఎస్సీ వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మెన్ సురేశ్ యాదవ్ మాట్లాడుతూ .. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు.

అందుకే  నిరుద్యోగులు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కొట్లాడుతుంటే పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. మెగా డీఎస్సీ వేస్తామని గతంలో  ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని..కనీసం వాయిదా చేయమని అడిగినా పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు. ఎగ్జామ్  కు , ఎగ్జామ్ కు మధ్య కనీసం 20 రోజులు లేకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్  రాయమంటే ఎలా  రాస్తారని ప్రశ్నిచారు.

టెట్ కు , డీఎస్సీకి మధ్యలో   కనీసం 30 రోజులు గ్యాప్ కూడా లేదని..టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎగ్జామ్ ఎలా పెడుతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్లల్లో గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్లు కూడా ఉన్నారని.. ముఖ్యమంత్రి చొరవ చూపి డీఎస్సీని వాయిదా వేయాలని కోరారు. జూలై 21న డీఎస్సీ రాసి ఆగస్టులో గ్రూప్స్ మెయిన్స్ రాయడం ఎలా సాధ్యమవుతుందో అధికారులు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను  పోలీసులు అరెస్ట్ చేశారు.

25 వేల పోస్టులతో డీఎస్సీ వేయాలి: కృష్ణయ్య

డీఎస్సీ వాయిదా వేయటంతోపాటు 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మైన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ మట్టడి కార్యక్రమంలో  కృష్ణయ్య పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో 2200 మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిటీ రిపోర్టులో పేర్కొందని వివరించారు. గత 10 ఏళ్లలో దాదాపు 6వేలకు పైగా పాఠశాలలు మూసివేశారని వీటిలోని టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.