
న్యూఢిల్లీ: ఇండియా, ఏసియన్ బ్లాక్ మధ్య నెలకొన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ)పై ఈ నెల ఏప్రిల్ నుంచి రివ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు. చర్చలు నెమ్మదిగా జరుగుతున్నాయని అన్నారు. ఇండియాకు ఏసియన్ ముఖ్యమైన వ్యాపార భాగస్వామి. మన గ్లోబల్ ట్రేడ్లో 11 శాతం ఈ అసోసియేషన్తోనే జరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఏసియన్) లో 10 దేశాలు మెంబర్లుగా ఉన్నాయి.
అవి బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ది ఫిలిఫ్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం. ఇండియా 2023–24 లో 41.2 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్ను ఏసియన్కు ఎగుమతి చేసింది. 80 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరుపుకుంది. గూడ్స్కు సంబందించి 2009లో ఇండియా, ఏసియన్ మధ్య ఎఫ్టీఏ కుదిరింది. 2010 లో అమల్లోకి వచ్చింది. 2025 నాటికి ఎఫ్టీఏని పూర్తిగా రివ్యూ చేయాలని 2023 ఆగస్టులో ఇరు వర్గాలు నిర్ణయించుకున్నాయి. –
ఇండియా–యూకే ఎఫ్టీఏ చర్చలు మొదలు..
సుమారు ఎనిమిది నెలల తర్వాత ఇండియా, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు తిరిగి మొదలు కానున్నాయి. సోమవారం నుంచి చర్చలు మొదలవుతాయని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఎఫ్టీఏ చర్చలు 2022 జనవరిలో మొదలయ్యాయి. ఇప్పటివరకు 14 రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. కాగా, ఎఫ్టీఏ కుదిరితే ఇరు దేశాల దిగుమతులపై సుంకాలు తగ్గుతాయి. ఇంకా చాలా సెక్టార్లలో పెట్టుబడులకు, వాణిజ్యానికి రూల్స్ సులభతరం అవుతాయి.