
- ఎం.ఎం.కీరవాణి, మోదడుగు విజయ్ గుప్తా,పసుపులేటి హనుమంతరావు, బి.రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ
- తెలంగాణ నుంచి ఐదుగురికి.. ఏపీ నుంచి ఏడుగురికి పద్మాలు
- మాజీ సీఎంలు ములాయం, ఎస్.ఎం.కృష్ణకు పద్మవిభూషణ్
- సుధామూర్తి, వాణి జయరామ్కు పద్మభూషణ్
- స్నేక్ క్యాచర్స్ వడివేల్ గోపాల్, మాసి సదయ్యన్కు పద్మశ్రీ
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామికి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆయనతోపాటు శ్రీరామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ కమలేశ్ డి పటేల్ (ఆధ్యాత్మిక రంగం)ను ఈ అవార్డులు వరించాయి. ఏపీ కోటాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణికి పద్మశ్రీ దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 106 పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ లిస్టులో ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మ భూషణ్ను అనౌన్స్ చేసింది. తెలంగాణకు రెండు పద్మభూషణ్, మూడు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో మత్స్య సాగు సైంటిస్ట్ మోదడుగు విజయ్ గుప్తా, వైద్య రంగంలో పసుపులేటి హనుమంతరావు, విద్య–సాహిత్య రంగంలో లింగ్విస్టిక్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ బి.రామకృష్ణారెడ్డిని పద్మశ్రీ వరించాయి. ఇదిలా ఉంటే..యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్కు పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి, ప్రముఖ గాయని వాణి జయరామ్, పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు పద్మభూషణ్ను కేంద్రం ప్రకటించింది.
ఏపీ కోటాలో ఏడుగురికి పద్మశ్రీ
ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వారిలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(మ్యూజిక్), కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం – విద్య), గణేశ్ నాగప్ప, నాగేశ్వరరావు (సైన్స్ – ఇంజనీరింగ్), సీవీ రాజు(ఆర్ట్), సంకురాత్రి చంద్రశేఖర్ (సామా జిక సేవ) ఉన్నారు. మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రోగ్రాంలో పురస్కారాలిస్తారు.
ఆధ్యాత్మిక రంగంలో దాజీ
ఆధ్యాత్మిక రంగంలో దాజీగా ప్రసిద్ధి చెం దిన కమలేశ్ డి.పటేల్ శ్రీరామచంద్ర మిషన్కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అహ్మదాబాద్ లో పుట్టిన ఆయన.. అక్కడే ఫార్మసీ చదివారు. స్టూడెంట్గా ఉన్నప్పుడు షాజహాన్పూర్కు చెందిన రామచంద్ర గైడెన్స్లో 1976లో సహజ్ మార్గ్ రాజయోగ ధ్యాన విధానాన్ని అభ్యసించారు. అహ్మదాబాద్లోని ఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి ఆనర్స్ లో పట్టా పొందాక న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ఫార్మాస్యూటికల్ బిజినెస్ను విస్తరించారు. 2003 నుంచి శ్రీరామచంద్ర మిషన్ కోసం పనిచేస్తున్నారు. 2014లో చారిజీ చనిపోయాక మిషన్ మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
బధిరుల సంక్షేమానికి కృషితో..
బధిరుల సంక్షేమానికి చేసిన కృషికిగానూ పసుపులేటి హనుమంతరావుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఆయన స్వస్థలం. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. నీలోఫర్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్లో ఎండీగా పని చేశారు. ఆ తర్వాత ముంబైలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్లో ట్రైనింగ్ తీసుకుని ఓయూ నుంచి రిహాబిలిటేషన్ సైకాలజీలో పీహెచ్డీ చేశారు.
భాషలకు రక్ష
అంతరించిపోతున్న భాషలను రక్షించేందుకు చేసిన కృషికిగానూ పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. ఆయన పూణే వర్సిటీ నుంచి డీ లిట్(డాక్టరేట్ ఆఫ్ లెటర్స్) పట్టా అం దుకున్నారు. చిత్తూరులో పుట్టిన రామకృష్ణారె డ్డి.. లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీలో విశేష కృషి చేశా రు. అంతగా ప్రాచుర్యంలోలేని గిరిజన భాషలను డాక్యుమెంటేషన్ చేశా రు. మైసూర్లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్కు రిసోర్స్ పర్సన్గా ఉన్నారు.
ఫిషరీస్లో పరిశోధనకు..
ఫిషరీస్ పై అనేక పరిశోధనలు చేసిన గుంటూ రు జిల్లా బాపట్లకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త మోదడుగు విజయ్గుప్తాకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఎమ్మెస్సీ చదివాక చీరాలలో లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత అస్సాంలోని ఓ కాలేజీలో జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేశారు. ఆ తర్వాత కోల్కతాకు వెళ్లి ఫిషరీస్ రీసెర్చ్లో చేరారు. ఫీల్డ్ స్టడీ కోసం చేపల చెరువులకు వెళ్లేవారు. తక్కువ ఖర్చుతో చేపల పెంపకంపై పరిశోధన చేసినందుకు 2005లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది.
స్నేక్ క్యాచర్ లకు పద్మశ్రీ
చెన్నై: తమిళనాడులోని ఇరుళ తెగకు చెం దిన స్నేక్ క్యాచర్ లు వడివేల్ గోపాల్, మా సి సదయ్యన్లకు సంయుక్తంగా పద్మశ్రీ అవార్డు వరించింది. వీళ్లిద్దరూ చదువుకోలేదు కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు తిరిగి పాములు పట్టాలని ఆసక్తి ఉన్నవాళ్లకు ఆ విద్యను నేర్పించారు. పాములు పట్టడంలో తమ తెగకు చెందిన పూర్వీకుల నుంచి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన టెక్నిక్స్ నే వీళ్లు ఫాలో అవుతూ, ఇతరులకు నేర్పిస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీ ఆహ్వానం మేరకు వీళ్లిద్దరు 2017లో అక్కడి కెళ్లారు. వర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పైథాన్ డిటెక్షన్ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏకంగా 27 పైథాన్ లను వీరు పట్టుకున్నారు.
ఆరుగురికి పద్మవిభూషణ్
పద్మవిభూషణ్ ఈ సారి ఆరుగురికి దక్కింది. ఇందులో బాలకృష్ణ దోసి (ఆర్కిటెక్చర్), జాకీర్ హుస్సేన్ (ఆర్ట్), ఎస్.ఎం. కృష్ణ (పబ్లిక్ ఎఫైర్స్), దిలీప్ మహలనాబిస్ (మెడిసిన్), శ్రీనివాస వర్దన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ములాయం సింగ్ యాదవ్ (పబ్లిక్ ఎఫైర్స్) ఉన్నారు.