
చిన్నశంకరంపేట, వెలుగు: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదనే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయన కొడుకు రోహిత్ రావు సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని ధరిపల్లి, అగ్రహారం, గవ్వలపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, బీజేపీకి ఓటేస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుందన్నారు.11 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల పాలకులు అభివృద్ధి చెందారే తప్ప, పల్లెలు అభివృద్ధి చెందలేవన్నారు.
దేశంలో ఎక్కడా అమలుకానీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని కితాబిచ్చారు. ముచ్చటగా మూడోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను గెలిపించుకొని కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ సత్తా చూపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లోరి మాధవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, నాయకులు ఏకే గంగాధర్ రావు, నరసింహారెడ్డి, షేక్ రెడ్డి, చంద్రం, వెంకటేశం, శివుడు, నాగరాజు, రాజు, మహేశ్, రాజ్ కుమార్, సురేశ్ పాల్గొన్నారు.