టెర్రరిస్టుల కోసం వేట మొదలు

టెర్రరిస్టుల కోసం వేట మొదలు

 

  • జమ్మూకాశ్మీర్​లో అణువణువూ జల్లెడ పడ్తున్న భద్రతా దళాలు
  • బారాముల్లాలో ఇద్దరు చొరబాటుదారుల హతం
  • కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్​, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు
  • 28కి చేరిన పహల్గాం టెర్రర్​ అటాక్​ మృతుల సంఖ్య
  • ఘటనకు కారణమైన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
  • స్పాట్​ను పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్​షా

శ్రీనగర్​/న్యూఢిల్లీ: టూరిస్టులే లక్ష్యంగా మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగుతున్నది. జమ్మూకాశ్మీర్​లోని అణువణువును భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అనుమానితులను విచారిస్తున్నాయి. టెర్రరిస్టులకు పాకిస్తాన్​తో ఉన్న లింకులను బయటకు తీస్తున్నాయి. దాడికి పాల్పడ్డది ఎంతమంది? వారిలో లోకల్స్​ ఎవరైనా ఉన్నారా? పాకిస్తాన్​ నుంచి వచ్చినవాళ్లు ఎవరు? అని ఆరా తీస్తున్నాయి. 

అనంత్​నాగ్​ జిల్లా పహల్గాంలోని బైసరన్​లో పర్యాటకులపై  మంగళవారం ఆర్మీ యూనిఫామ్​లో వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు జరపడం, మతం అడిగి మరీ ఘాతుకానికి తెగబడటం యావత్​ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరగగా.. ఆర్మీ, సీఆర్పీఎఫ్​, లోకల్​ పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. 

ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అదే రాత్రి జమ్మూకాశ్మీర్​కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా దళాల ఆఫీసర్లతో సమావేశమయ్యారు. బుధవారం బైసరన్​కు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చారు. సౌదీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

సెక్యూరిటీ లేదని తెలిసి అటాక్​

అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్న వేళ జమ్మూకాశ్మీర్​లో టెర్రర్​ అటాక్​ జరగడం కలకలం రేపింది. పక్కా స్కెచ్​తోనే ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగబడ్డట్టు తెలుస్తున్నది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూకాశ్మీర్​కు టూరిస్టుల తాకిడి పెరిగింది. అనంత్​నాగ్​ జిల్లా పహల్గాంలోని బైసరన్​ లోయ పచ్చని అడవులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’​ అని పిలుస్తుంటారు. 

పహల్గామ్​ నుంచి ఇక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి రావాలంటే కాలినడకన లేదా గుర్రాలపై రావాల్సి ఉంటుంది. అలా రావడానికి చాలా టైమ్​ పడుతుంది. సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండని ఏరియా ఇది. అందుకే ఈ ఏరియాలోని టూరిస్టులను ఉగ్రవాదులు తమ లక్ష్యంగా ఎంచుకొని అటాక్​ చేశారు. అక్కడ అటాక్​ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సహాయ చర్యలు కూడా ఆలస్యమవుతాయని ప్లాన్​ వేశారు. 

మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరిగాయి. ఆర్మీ యూనిఫామ్​లో వచ్చిన టెర్రరిస్టులు.. టూరిస్టులను మతం అడిగి, ప్రార్థనలు చేయించి, ఐడీ కార్డులు చెక్​ చేసి ఆ తర్వాత కాల్చిచంపారు. టెర్రరిస్టులు తమ బాడీకి కెమెరాలు తగిలించుకొని కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. కాల్పులను కెమెరాల్లో రికార్డు చేసినట్లు సమాచారం. అనంతరం పారిపోయారు. భద్రతా దళాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ డెడ్​బాడీలు పడి ఉన్నాయి. కొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. 

టెర్రరిస్టుల ఫొటోలు విడుదల

పహల్గామ్​ అటాక్​లో ఐదుగురి నుంచి ఆరుగురు టెర్రరిస్టులు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. వారి నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా మొదట ముగ్గురు టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. వీరిలో ఒకరు ఆసిఫ్​ ఫౌజీ, మరొకరు సులేమాన్​ షా, ఇంకొకరు అబూ తల్హా అని వివరించాయి. వీరు మూసా, యూనస్​, ఆసిఫ్​ అనే కోడ్​ పేర్లతో తిరిగేవారని పేర్కొన్నాయి. కాగా, అనంతరం నలుగురు టెర్రరిస్టుల ఫొటోలు బయటకు వచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడ్డవారిలో ఇద్దరు స్థానిక టెర్రరిస్టులు ఉన్నట్లు, మరో ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్​కు చెందినవారు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.