
- జమ్మూకాశ్మీర్లో అణువణువూ జల్లెడ పడ్తున్న భద్రతా దళాలు
- బారాముల్లాలో ఇద్దరు చొరబాటుదారుల హతం
- కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు
- 28కి చేరిన పహల్గాం టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య
- ఘటనకు కారణమైన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
- స్పాట్ను పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా
శ్రీనగర్/న్యూఢిల్లీ: టూరిస్టులే లక్ష్యంగా మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగుతున్నది. జమ్మూకాశ్మీర్లోని అణువణువును భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అనుమానితులను విచారిస్తున్నాయి. టెర్రరిస్టులకు పాకిస్తాన్తో ఉన్న లింకులను బయటకు తీస్తున్నాయి. దాడికి పాల్పడ్డది ఎంతమంది? వారిలో లోకల్స్ ఎవరైనా ఉన్నారా? పాకిస్తాన్ నుంచి వచ్చినవాళ్లు ఎవరు? అని ఆరా తీస్తున్నాయి.
అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్లో పర్యాటకులపై మంగళవారం ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు జరపడం, మతం అడిగి మరీ ఘాతుకానికి తెగబడటం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరగగా.. ఆర్మీ, సీఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అదే రాత్రి జమ్మూకాశ్మీర్కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా దళాల ఆఫీసర్లతో సమావేశమయ్యారు. బుధవారం బైసరన్కు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చారు. సౌదీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
సెక్యూరిటీ లేదని తెలిసి అటాక్
అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్న వేళ జమ్మూకాశ్మీర్లో టెర్రర్ అటాక్ జరగడం కలకలం రేపింది. పక్కా స్కెచ్తోనే ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగబడ్డట్టు తెలుస్తున్నది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూకాశ్మీర్కు టూరిస్టుల తాకిడి పెరిగింది. అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ పచ్చని అడవులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’ అని పిలుస్తుంటారు.
పహల్గామ్ నుంచి ఇక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి రావాలంటే కాలినడకన లేదా గుర్రాలపై రావాల్సి ఉంటుంది. అలా రావడానికి చాలా టైమ్ పడుతుంది. సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండని ఏరియా ఇది. అందుకే ఈ ఏరియాలోని టూరిస్టులను ఉగ్రవాదులు తమ లక్ష్యంగా ఎంచుకొని అటాక్ చేశారు. అక్కడ అటాక్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సహాయ చర్యలు కూడా ఆలస్యమవుతాయని ప్లాన్ వేశారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరిగాయి. ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన టెర్రరిస్టులు.. టూరిస్టులను మతం అడిగి, ప్రార్థనలు చేయించి, ఐడీ కార్డులు చెక్ చేసి ఆ తర్వాత కాల్చిచంపారు. టెర్రరిస్టులు తమ బాడీకి కెమెరాలు తగిలించుకొని కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. కాల్పులను కెమెరాల్లో రికార్డు చేసినట్లు సమాచారం. అనంతరం పారిపోయారు. భద్రతా దళాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ డెడ్బాడీలు పడి ఉన్నాయి. కొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.
టెర్రరిస్టుల ఫొటోలు విడుదల
పహల్గామ్ అటాక్లో ఐదుగురి నుంచి ఆరుగురు టెర్రరిస్టులు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. వారి నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా మొదట ముగ్గురు టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. వీరిలో ఒకరు ఆసిఫ్ ఫౌజీ, మరొకరు సులేమాన్ షా, ఇంకొకరు అబూ తల్హా అని వివరించాయి. వీరు మూసా, యూనస్, ఆసిఫ్ అనే కోడ్ పేర్లతో తిరిగేవారని పేర్కొన్నాయి. కాగా, అనంతరం నలుగురు టెర్రరిస్టుల ఫొటోలు బయటకు వచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడ్డవారిలో ఇద్దరు స్థానిక టెర్రరిస్టులు ఉన్నట్లు, మరో ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్కు చెందినవారు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.