
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తరువాత భారత – పాకిస్తాన్ బోర్డర్ లో యుద్ద వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ దేశానికి చెందిన యుద్ద విమానాలు నూర్ ఖాన్ బేస్ క్యాంప్ లో చక్కర్లు కొడుతున్నాయి. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అప్రమత్తమైంది. బార్డర్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిర్ బేసెస్కు సమీపంలో విమానాలను మోహరించింది. కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపు ఉన్న లాహోర్, రావల్పిండి సమీపంలో ఉన్న క్యాంపులకు విమానాలను తరలించినట్లు తెలుస్తున్నది.
ఇండియా నుంచి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రతిఘటన రావొచ్చనే ఆందోళన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నది. దీనికి సంబంధించిన విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రావల్పిండిలో పాకిస్తాన్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది. ఇది ఇండియా సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం.
దాడితో మాకు సంబంధం లేదు: పాకిస్తాన్
ఇదిలా ఉండగా.జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో తమకు సంబంధంలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపాడు. ప్రాణనష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ‘‘టెర్రరిస్టుల అటాక్లో టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. దాడుల వెనుక మా ప్రమేయం ఉందన్న వాదనను ఖండిస్తున్నాం’’ అని ఆసిఫ్ అన్నాడు. కాగా, పహల్గామ్ టెర్రర్ అటాక్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియాలోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ అన్నారు. ‘మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తున్నది’ అని ట్వీట్ చేశారు..