
ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో.. పాకిస్తాన్ దేశం ముందస్తు చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా సరిహద్దుల్లోని నూర్ ఖాన్ ఆర్మీ బేస్ లో.. 2025, ఏప్రిల్ 29వ తేదీ ఉదయం.. పాకిస్తాన్ కు చెందిన F16 జెట్ యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. ఇండియా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్న పాకిస్తాన్.. ఆ దిశగానే మరో ముందస్తు చర్యలకు దిగింది. భారీ ఎత్తున ఇంధన నిల్వలు పెంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్మీకి కావాల్సిన ఇంధనం.. పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాలను భారీ ఎత్తున నిల్వ చేస్తుందంట.
పాకిస్తాన్ దగ్గర వెయ్యికి పైగా యుద్ధ ట్యాంకులు, 8 వేలకు పైగా సైన్యాన్ని తరలించే వాహనాలు, వెయ్యికి పైగా జెట్ యుద్ధ విమానాలు వంటివి ఉన్నాయి. వీటన్నింటికీ ఇంధనం కావాలి. దేశ అవసరాలకే కాకుండా.. యుద్ధానికి పెద్ద ఎత్తున ఇంధనం అవసరం అవుతుంది. ముందస్తు వ్యూహంలో.. ముందస్తు చర్యల్లో భాగంగా లక్షల లీటర్ల ఇంధనాన్ని నిల్వ చేసుకునే దిశగా దిగుమతులు కూడా పెంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ బలాబలాలు:
* పాకిస్తాన్ వద్ద 1,399 విమానాలు.. 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు
* 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు
* 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు
* యుద్ధ ట్యాంకులు 2627
* సాయుధ వాహనాలు 17516
* ఫిరంగ వ్యవస్థలు 2629
* పాకిస్తాన్ సబ్ మెరైన్లు 8
* పాకిస్తాన్ యుద్ధ నౌకలు 114
* పాకిస్తాన్ సైనిక దళం 6 లక్షల 50 వేలు
* పారా మిలటరీ 5 లక్షలు
వాస్తవానికి మన దేశ సైనిక వ్యయం పాకిస్తాన్తో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువని స్వీడిష్ థింక్ ట్యాంక్ ఒక రిపోర్టు విడుదల చేసింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ రంగానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్న ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ఇండియా, పాక్ మధ్య ప్రస్తుతమున్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ హోమ్ ఈ నివేదికను రిలీజ్ చేసింది.