
చండీగఢ్: ఇండియా 48 గంటల డెడ్లైన్ విధించడంతో దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులు తమ దేశానికి వెళ్లేందుకు అమృత్సర్లోని అటారీ- వాఘా సరిహద్దుకు తరలుతున్నారు. పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ దేశస్తులను బహిష్కరించడం, 1960 సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, అటారీ ల్యాండ్ ట్రాన్సిట్ పోస్ట్ను మూసివేయడం వంటి చర్యలు ప్రకటించింది. పాకిస్థాన్ పౌరులు ఇకపై సార్క్ వీసా ఎగ్జెప్షన్ స్కీమ్ కింద సైతం ఇండియాకు రాకూడదని, ఇప్పటికే ఉన్నవారు 48 గంటల్లో వెళ్లిపోవాలని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం మరోసారి ప్రకటించారు.
అటారీలోని చెక్పోస్ట్ను వెంటనే మూసివేస్తున్నట్లు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ప్రకటించింది. చట్టబద్ధమైన పత్రాలతో పాకిస్థాన్కు వెళ్లినవారు మే 1 లోపు ఈ మార్గం ద్వారా తిరిగి రావచ్చని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం పాకిస్థాన్ కు చెందిన పలు కుటుంబాలు అటారీ చెక్పోస్ట్కు చేరుకున్నాయి. ఢిల్లీలో బంధువులను కలవడానికి పాకిస్తాన్ లోని కరాచీ నుంచి ఇటీవల వచ్చిన షేక్ ఫజల్ అహ్మద్ కుటుంబం అక్కడికి చేరుకుంది. తమకు 45 రోజుల వీసా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరిగి వెళ్తున్నామని చెప్పారు.