
- సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్టు
- సర్కారు మీదే కదా పర్మిషన్ తెప్పించాలన్న ఎమ్మెల్యే
- మున్సిపల్ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన
- మద్దతు తెలిపిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
జనగామ, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. మీడియాపై వారి వివక్ష కంటిన్యూ అవుతోంది. జనగామలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి..మంగళవారం జరిగిన మున్సిపల్ మీటింగ్కు జర్నలిస్టులను రానియ్యకుండా అడ్డుకున్నారు. మున్సిపల్కమిషనర్కు చెప్పి బయటికి పంపించారు. జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. మీడియాను లోనికి అనుమతించాలని పట్టుబట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లతో మీదే గవర్నమెంటు కదా, పర్మిషన్ జీవో తెప్పించండి అంటూ వెటకారంగా మాట్లాడారు. జనగామ మున్సిపల్ జనరల్బాడీ మీటింగ్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాన్ఫరెన్స్హాల్లో చైర్పర్సన్ పోకల జమున లింగయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. దీనికి చీఫ్గెస్ట్గా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
మీటింగ్ కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కనుసైగతో ఇన్చార్జి కమిషనర్ చంద్రమౌళి..మీడియా ప్రతినిధులను బయటకు పంపించాలని అక్కడే ఉన్న మున్సిపల్ మేనేజర్రాములును ఆదేశించారు. మేనేజర్బయటకు వెళ్లాలని చెప్పడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇటీవల జరిగిన మున్సిపల్ మీటింగ్కు అనుమతించారని, ఇప్పుడు మళ్లీ ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఇన్చార్జి కమిషనర్ చంద్రమౌళి వచ్చి మీడియాకు అనుమతి లేదని చెప్పే ప్రయత్నం చేశారు. నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్..మున్సిపాలిటీల్లో జరుగుతున్న విషయాలు బయటకురావద్దని కేవలం ఓరల్ఆర్డర్స్ మాత్రమే ఇచ్చారని, అది అఫీషియల్ కాదని జర్నలిస్టులు చెప్పారు. కొత్త సర్కారు ఏమైనా జీవో ఇచ్చి ఉంటే చూపాలని నిలదీయడంతో ఇన్చార్జి కమిషనర్తెల్లమొహం వేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేకు చెందిన సోషల్మీడియా ప్రతినిధులు మాత్రం దర్జాగా మీటింగ్ హాల్లోనే కూర్చుండిపోయారు.
దీనిపై జర్నలిస్టులు ప్రశ్నించగా ఆఫీసర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త, సీనియర్లీడర్ వంగాల మల్లారెడ్డి మీటింగ్ హాల్లోకి వచ్చి మొత్తం మీడియానైనా అనుమతించాలని, లేదంటే హాల్లో కూర్చున్న ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులనైనా బయటకు పంపాలని పట్టుబట్టారు. దీంతో సోషల్మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు. తర్వాత ఆగ్రహించిన జర్నలిస్టులు ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. వారికి కాంగ్రెస్ కౌన్సిలర్లు జక్కుల అనిత, వంగాల కల్యాణి, గంగరబోయిన మల్లేశం, రామగల్ల అరుణ, ముస్త్యాల చందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ గత జనరల్ బాడీ మీటింగ్ లోపలికి జర్నలిస్టులను అనుమతిచ్చిన ఆఫీసర్లు ఇప్పుడెందుకు అనుమతించడం లేదన్నారు.
నియంతృత్వ, గడీల పాలనను ఓడించి కాంగ్రెస్ ప్రజా పాలనకు జనం పట్టం కట్టినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరు మారడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాపై ఎమ్మెల్యే ఆంక్షలు ఏమిటన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా అక్కడికి వచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న ఎమ్మెల్యే స్పందించకపోగా మీడియాను బయటకు పంపడంలో తన తప్పేమీ లేదని తన అనుచరులతో చెప్పించడం కొనమెరుపు.